మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం - మార్గదర్శకాలు, భారం..!!
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం ఈ రోజు ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ మార్గదర్శకాలు జారీ చేసింది.
నేటి నుంచే అమలు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. హైదరాబాద్ సిటీలో.. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లలోనూ ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుంది. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు అర్హులని టీఎ్సఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఇకపై బస్పా్సలతో అవసరం లేకుండా పోయింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ ఏసీ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణానికి అవకాశం లేదని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ముందస్తు రిజర్వేషన్, ఇతర కారణాల వల్ల ఈ బస్సుల్లో వర్తింపజేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

మార్గదర్శకాలు జారీ : రాష్ట్ర వ్యాప్తంగా 7292 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా ఆర్టీసీపై అదనంగా రూ.3 వేల కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణ సమయంలో మహిళలు స్థానికత ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్కు చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రోజుల వరకు మాత్రం ఎలాంటి కార్డు చూపించకపోయినా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణానికి ఎలాంటి పరిమితులు, నిబంధనలు లేవని చెప్పారు. కిలోమీటర్ల ప్రయాణ పరిధి, రోజుకు నిర్ధిష్టమైన ట్రిప్పులు వంటి పరిమితులేవీ లేవన్నారు. టిమ్స్లో రిక్యాలిబరేషన్ పూర్తి చేసిన తర్వాత మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేస్తామన్నారు.

ఆర్టీసీపై భారం : టిక్కెట్ల ఆధారంగా ఆర్టీసీకి ప్రయాణ చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని, ఆ కార్డులపై ఉచిత ప్రయాణం అవకాశం లభిస్తుందని వెల్లడించారు. కాగా, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే (అంతర్రాష్ట్ర సర్వీసుల) బస్సుల్లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం సగానికి సగం తగ్గిపోనుంది. రోజూ సుమారు 35 లక్షల నుంచి 40 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి చార్జీల రూపంలో ప్రస్తుతం రోజుకు సుమారు రూ.14 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. శనివారం నుంచి ఈ ఆదాయం రూ.7 కోట్లకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ వివిధ వర్గాల రాయితీల కింద రూ.1000 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ నిధులను వినియోగిస్తోంది.












Click it and Unblock the Notifications