నేరస్తుడికి మరణశిక్ష.. తొమ్మిదేళ్ళ బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు!!
మహబూబాబాద్ లో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసు విచారణలో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో డబ్బు కోసం దీక్షిత్ రెడ్డి అనే బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడు వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా ఈ కేసులో కోర్టులో నేరం రుజువైనందున నేరస్తుడైన మంద సాగర్ కి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
మహబూబాబాద్ కు చెందిన జర్నలిస్టు రంజిత్ రెడ్డి, వసంతల కుమారుడు 9 సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి, ఆపై కేసముద్రం మండలం అన్నారం శివారులోని దానమయ్య గుట్టపైకి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టి, అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు నిందితుడు. కిడ్నాప్ అయిన బాలుడిని ప్రాణాలతో కాపాడాలని పోలీసులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. బాలుడిని కిడ్నాపర్ అత్యంత అమానవీయంగా చంపేశాడు. చిన్నపిల్లాడిని హతమార్చిన మంద సాగర్ ఒక సైకిల్ పంచర్ షాప్ నిర్వాహకుడు.
నాటి ఘటనపై ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టి మందా సాగర్ ను నిందితుడిగా తేల్చి అరెస్ట్ చేశారు.
మూడేళ్ళ పాటు ఈ కేసు కోర్టులో విచారణ సాగగా తాజాగా ఈ కేసులో సంచలన తీర్పు వచ్చింది . తాజాగా ఈ కేసులో కోర్టులో వాదోపవాదాలు జరగగా, దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణశిక్ష విధించారు న్యాయమూర్తి.
మహబూబాబాద్ జిల్లా జడ్జి ఈ కేసులో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు జడ్జి తీర్పుతో న్యాయం ఇంకా బ్రతికే ఉందని అన్నారు. తమ కుమారుడి ఆత్మకు శాంతి ఇంతకాలానికి కలిగిందని అన్నారు.












Click it and Unblock the Notifications