దత్తాత్రేయకు అవమానం: కవిత, అధికార పార్టీ నేతలను ఆపలేదు, విమర్శలు
హైదరాబాద్: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయకు బోనాల జాతరలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ఆయన వాహనాన్ని పోలీసులు ఆ
హైదరాబాద్: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయకు బోనాల జాతరలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ఆయన వాహనాన్ని పోలీసులు ఆలయం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
చెప్పినా వినకుండా ఆపేశారు
ప్రధాన రహదారిలో రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పాత భవనం వద్దే ఆపేశారు. రద్దీ ఉందంటూ అక్కడే ఆపాలని ఓ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. అయితే, దత్తాత్రేయ 9.20గంటలకు విమానంలో తిరుపతి వెళ్లే పని ఉందని, వాహనంలో ఉన్న ఆయన సతీమణి నడవలేక పోతున్నారని మంత్రి అనుచరులు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేగాక, దిగి నడిచి వెళ్లాలని కేంద్రమంత్రికే సూచించారు.
నడిచే వెళ్లిన దత్తాత్రేయ కుటుంబం
ఆ సమయంలో అక్కడేవున్న ఉత్తర మండలం డీసీపీ సుమతి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. పోలీసులు అలా స్పష్టం చేయడంతో దత్తాత్రేయ ఏమి మాట్లాడకుండా వాహనం దిగి కుటుంబసభ్యులతో ఆలయం వద్దకు నడిచివెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడూ ఆయన బయట కొంతసేపు వేచి చూసినా పోలీసులు స్పందించకపోవడంతో నడుచుకుంటూనే తిరిగి వెళ్లిపోయారు.
Recommended Video
ఎంపీ కవిత, అధికార పార్టీ నేతలకు అనుమతి..
అయితే ఆ తర్వాత వచ్చిన ఎంపీ కవిత, రాష్ట్రమంత్రులు, పలువురు శాసనసభ్యులు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డితో పాటు కొందరు కిందిస్థాయి నాయకుల వాహనాలను పోలీసులు ఆలయం వద్దకు అనుమతించడం శోచనీయం. ఈ విషయం ఆలస్యంగా బయటికి పొక్కడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
కేంద్రమంత్రి వాహనాన్ని ఆపడంపై విమర్శలు..
కేంద్రమంత్రి వాహనాన్ని నిలిపిన పోలీసులు.. అధికార పార్టీ ఎంపీలు, రాష్ట్రమంత్రులు, ఇతర నాయకుల వాహనాలకు ఎందుకు అనుమతిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్రమంత్రి వాహనం వెళితే భక్తులకు ఇబ్బంది అవుతుంది కానీ, రాష్ట్ర అధికార పార్టీ నేతలు వెళితే కాదా? అని నిలదీస్తున్నారు.
డీసీపీ వివరణ ఇలా..
దీనిపై డీసీపీ సుమతి వివరణ కోరగా.. కేంద్రమంత్రి వాహనం ఆపడం యాదృచ్ఛికంగా జరిగిందని, కావాలని చేసింది కాదని తెలిపారు. వీవీఐపీల వాహనాలకు ఆలయం వద్దకు అనుమతించాలని చెప్పామని, కానీ, సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. అంతేగాక, భక్తుల రద్దీ ఉందని చెప్పడంతో ఆయనే వాహనం దిగి వెళ్లారని తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయనకు కలిగిన ఇబ్బందికి తమ విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు.