ఫలించిన హరీష్ రావు చర్చలు: తుమ్మిడి హట్టికి మహారాష్ట్ర ఓకె
హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఆడ్డంకులు తొలిగాయి. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం నాగపూర్లో మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్తో జరిపిన చర్చలు ఫలించాయి. ఏళ్ల తరబడిగా మూలనపడి ఉన్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి ఈ చర్చల్లో దాదాపుగా మార్గం సుగమం చేశారు.
148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనితోపాటు గోదావరిపై తలపెట్టనున్న భారీ బ్యారేజీ అయిన మేడిగడ్డపైనా ఈ భేటీలో చర్చ మొదలైంది. దీనిపై నిర్ణయాన్ని అధ్యయనం తర్వాత వెల్లడిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఈనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్లో జరుగనున్న ప్రాణహిత బోర్డు సమావేశం కీలకంగా మారింది.
మంగళవారం మధ్యాహ్నం నాగపూర్లోని మహారాష్ట్ర విధానసభలో ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీశ్మహాజన్, సహాయ మంత్రి విజయ్ శివతరేతో పాటు రెండు రాష్ర్టాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రధానంగా గోదావరిపై నిర్మించనున్న తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలపై చర్చించారు.
గోదావరిలో తెలంగాణ రాష్ర్టానికి కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి తమ ప్రభుత్వం పథకాలు రూపొందిస్తున్నదని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నీరు ప్రధాన ప్రాతిపదికగా ఉందని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం మహారాష్ట్ర అంగీకారం లేకుండానే తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో బ్యారేజీని ప్రతిపాదించి, తదనుగుణంగా కాలువలను తవ్విందన్నారు. ఇదే సమయంలో కేంద్ర జలసంఘం కూడా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై అనుమానాలు వ్యక్తం చేసిందని మంత్రి వివరించారు.
ముంపు విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలు, కేంద్ర జలసంఘం వ్యక్తంచేసిన అనుమానాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పథకాలను అన్వేషించిందని మంత్రి హరీశ్రావు చెప్పారు. వ్యాప్కోస్ చేసిన అధ్యయనంలో గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డవద్ద 103 మీటర్లలో అత్యధిక వరద మట్టం (హైఫ్లడ్ లెవల్) వద్ద బ్యారేజీని నిర్మించాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు.
ఈ స్థాయిలో ముంపుమొత్తం నదిగర్భంలోనే ఉంటుందని వారి అధ్యయనంలో తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా తగ్గించిన ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మించి, ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మిగతా జిల్లాల అవసరాలకు మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్టు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించిందని మ్యాప్ ద్వారా ఆయన గిరీశ్ మహాజన్కు వివరించారు. ఈ రెండు బ్యారేజీలకు అనుమతిని మంజూరు చేయాలని హరీశ్రావు కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్రావు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు హరిరాం, భగవంత్రావు, ఎన్ వెంకటేశ్వర్లుతో పాటు ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, మహారాష్ట్రకు చెందిన జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ గవాయి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కులకర్ణి, చీఫ్ ఇంజినీర్ చౌహాన్ ఈ భేటీలో ఉన్నారు.