కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం.!గర్వంగా ఉందన్న బండి సంజయ్.!
హైదరాబాద్ : గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. కేంద్ర ప్రభుత్వం మరణానంతర అవార్డును ప్రకటించింది. భరతమాత ముద్దు బిడ్డకు పురస్కారం దక్కినందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా గర్వంగా ఉందనన్నారు. మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన భార్య సంతోషి, తల్లి అవార్డును అందుకున్నారని సంజయ్ వివరించారు. ఆపరేషన్ స్నో లియోపార్డ్ లో భాగంగా 16 బీహార్ రెజిమెంట్ కు నాయకత్వం వహిస్తున్న కర్నల్ బికుమళ్ల సంతోష్ బాబు గల్వాన్ లోయలో శత్రువుతో పోరాడి అమరుడయ్యారని, అప్పగించిన పనిని ఆయన విజయవంతంగా పూర్తి చేసారని, తన బలగాలను సిద్ధం చేసి ప్రత్యర్థి దేశ సైనికులతో జరిగిన ఫేసాఫ్ లో వారిని అడ్డుకున్నారని తెలిపారు. రాళ్ల దాడులు, మారణాయుధాలతో విరుచుకుపడిన శత్రు మూకలను ఎదురొడ్డి అడ్డగించారని బండి సంజయ్ గుర్తు చేసారు.
అంతే కాకుండా యుద్దం చేస్తున్న క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా మొక్కవోని ఆత్మవిశ్వాంతో శత్రువులతో పోరాడి, వీరమరణం పొందారని, తుది శ్వాస వరకు ముందుండి తన బృందాన్ని నడిపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని బండి సంజయ్ కొనియాడారు. ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారని, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని స్పష్టం చేసారు. సంతోష్ బాబు పరాక్రమాన్ని ఆయనకు బహూకరించిన అవార్డుతో పాటు, ప్రశంసా పత్రంలో పేర్కొన్నారని తెలిపారు. కాగా, నాయబ్ సుబేదార్ నుదురాం సోరెన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయ్ గుర్తేజ్ సింగ్ లకు వీరచక్ర అవార్డును అందించనున్నారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ సైనికులను సంతోష్ బాబు టీం నిలువరించింది. ఆ క్రమంలో సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు. అమరుల కు మరోమారు నివాళులు అర్పిస్తున్నట్టు బండి సజయ్ తెలిపారు.