సిద్ధాపురం సమస్యలు తెలుసుకుంటున్న మహేష్ బాబు, 15న భేటీ
హైదరాబాద్: 'శ్రీమంతుడు' మహేష్ బాబు మంగళవారం నాడు సిద్ధాపురం గ్రామానికి సంబంధించిన సమాచారం సేకరించేందుకు తన ప్రతినిధులను కొందరిని గ్రామానికి పంపించారు. వారు స్థానిక నేతలతో సమావేశమై ప్రధాన సమస్యలు, పరిష్కారాల పైన చర్చించారు.
ఈ బృందంలో భూపాల్ రెడ్డి, మధు, కృష్ణ-మహేష్ ప్రజాసేన చీఫ్ ఖాదర్ తదితరులు ఉన్నారు. వారు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ యువకులు, నాయకులతో కలిసి సిద్ధాపురంలో పర్యటించారు. ఈ నెల 15వ తేదీన మహేష్ బాబు గ్రామస్థులతో దత్తత, సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారని తెలిపారు.
సినీ నటుడు మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, నేను (మహేష్ బాబు) బాగా ఆలోచించిన తర్వాత సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణంపై కెసిఆర్ సమీక్ష
డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణం పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలెక్టర్లతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. వారికి దిశా నిర్దేశనం చేశారు. ఈ ఏడాది 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేయాలన్నారు.
వచ్చే ఏడాది ఇళ్ల నిర్మాణాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. గ్రామాల్లో 36 వేలు, పట్టణాల్లో 24 వేల ఇళ్ల నిర్మాణం జరగాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 400 ఇళ్లు నిర్మించాలన్నారు. యాభై శాతం ఎమ్మెల్యేలు, మిగతా యాభై శాతం మంత్రులు ఇళ్లను మంజూరు చేస్తారని చెప్పారు. ఇళ్లు రెండు తరాలకు ఉపయోగపడేలా నిర్మించాలన్నారు. గతంలో గృహ నిర్మాణ పథకంలో భారీ అవినీతి జరిగిందన్నారు.