కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: భయంతో పరుగులు తీసిన జనం, ముగ్గురు మృతి?
హైదరాబాద్: నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. రోడ్డు నెంబర్ 18లో ఉన్న శాలిస్లైట్ కెమికల్ ప్యాక్టరీలో సిలిండర్లు, రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఉదయం 9 గంటల సమయంలో తొలి పేలుడు వినిపించగా, అప్పటికే అక్కడ ఉన్న కార్మికులను అలర్ట్ చేస్తూ అలారం మోగింది. దీంతో సిబ్బంది, ఉద్యోగులంతా బయటకు రాగా ఫ్యాక్టరీలోని కెమికల్ సిలిండర్లు పేలుతున్నాయి. భారీ పేలుడు శబ్ధంతో దట్టమైన పొగలు దాదాపు 200 అడుగులకు పైగా అలుముకున్నాయి.

దట్టమైన పొగలు నాచారం నుంచి మల్లాపూర్ వరకూ అంటే సుమారు ఐదు కిలోమీటర్ల దూరం కమ్మేయగా, సమీపంలోని ఓ ఇల్లు కూడా మంటల్లో చిక్కుకుంది. భారీగా పేలుడు శబ్దంతో ఉలిక్కిపడిన స్థానికులు పరుగులు తీశారు. మంటలు ఎగిసిపడటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.
దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు పైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు విస్తరిస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరిన్ని ఫైరింజన్లు, విపత్తు సహాయక సిబ్బంది వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
భారీగా ఎగిసిపడుతున్న మంటలను చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తించకుండా ఉండేదుకు అగ్నిమాపక సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఈ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
కెమికల్ ప్యాక్టరీలోని సిలిండర్లు, రియాక్టర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకోవడంతో ప్రజలు శ్వాస సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications