పప్పు రాహుల్ అడుగుపెడితే అంతే సంగతులు: మంత్రి మల్లారెడ్డి సెటైర్లు, పాత సినిమానే అంటూ సుమన్
హైదరాబాద్: వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కారుపై చేసిన విమర్శలకు తెలంగాణ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎద్దేవా చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. శనివారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల పరిధిలోని ఉద్దమర్రి, కేశవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మల్లారెడ్డి ప్రారంభించారు.
పప్పు రాహుల్ గాంధీ అంటూ మల్లారెడ్డి విమర్శలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీపైనా విమర్శలు గుప్పించారు. రైతు సంఘర్షణ్ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు వాళ్ల ప్రభుత్వం పాలిస్తున్న రెండు, మూడు రాష్ట్రాల్లో ఎంత మేర రైతులను ఆదుకుంటున్నారో చూసుకుని రావాలన్నారు. ఆ తర్వాతే తెలంగాణకు రావాలన్నారు.
పప్పు రాహుల్ అడుగుపెడితే అంతేనంటూ మల్లారెడ్డి సెటైర్లు
ఇప్పటి వరకు పప్పు రాహుల్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా తిరిగి అధికారంలోకి రాలేక ఓడిపోయాయని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతోందని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది ఒక్క టీఆర్ఎస్ సర్కారేనని వ్యాఖ్యానించారు.
కొత్త థియేటర్లో పాత సినిమా అంటూ బాల్క సుమన్ విమర్శలు
మరోవైపు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. కొత్త థియేటర్లో పాత సినిమా లాగా కాంగ్రెస్ సభ ఉందన్నారు. ఆ సభ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఉంటాడట అని ఎద్దేవా చేశారు బాల్క సుమన్. స్టేజి మీద ఉన్నోడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేడన్నారు. బీజేపీ నడ్డా సభలో కూడా ఒక్కడు కూడా ఉద్యమంలో లేడన్నారు. బండి సంజయ్పై తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసైన ఉందా? అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ ఎవడికి తెలుసన్నారు. నిజానికి కాంగ్రెస్ సభ.. మానసిక సంఘర్షణ సభ లాగా ఉందని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. శుక్రవారం రాహుల్ వరంగల్ సభలో చేసిన విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.