కేసీఆర్ కు మమతా బెనర్జీ హ్యాండిచ్చినట్టే.. వాట్ నెక్స్ట్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశలపై మమతా బెనర్జీ నీళ్లు పోశారు. వచ్చే ఎన్నికలలో అధికార బీజేపీని ఢీకొట్టడానికి బలమైన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చి కూటమిగా పోరాడాలని భావిస్తున్న కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశలపై మమతా బెనర్జీ నీళ్లు పోశారా? వచ్చే ఎన్నికలలో అధికార బీజేపీని ఢీకొట్టడానికి బలమైన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చి కూటమిగా పోరాడాలని భావిస్తున్న కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారా? పశ్చిమ బెంగాల్ బెబ్బులిగా పేరున్న ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ కెసిఆర్ ఏర్పాటు చేసే బీఆర్ఎస్ కూటమికి దూరంగా ఉండబోతున్నారా? అంటే అవును అన్న సమాధానం వస్తుంది.

ప్రతిపక్షాలను ఏకతాటి మీదకు తీసుకురావటంలో ఫోకస్ చేస్తున్న కేసీఆర్
2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎవరికి వారు వ్యూహాత్మకంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చి వచ్చే ఎన్నికలలో బిజెపిపై సమరం చేయాలని భావిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను అన్నింటిని ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నాటికి బలమైన ప్రతిపక్షాలనన్నిటిని ఒకచోటకు చేర్చి బిజెపిపై యుద్ధాన్ని ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకులపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అందులో మమతా బెనర్జీ కూడా ఉన్నారు.

మమతా బెనర్జీ కెసిఆర్ కూటమితో కలిస్తే బాగుంటుందని కేసీఆర్ లెక్కలు
పశ్చిమ బెంగాల్ సీఎం గా ఉన్న మమతా బెనర్జీ కెసిఆర్ కూటమితో కలిసి బిజెపిపై పోరాటం చేస్తే బిఆర్ఎస్ కు అది మరింత ప్లస్ గా మారుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో జరగనున్న ప్లీనరీ సమావేశాల తర్వాత ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు మమతా బెనర్జీని కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మమతా దీదీని కన్విన్స్ చేస్తే, తాను కూడా తమతో జత కడితే బిజెపి పై పోరాటం చేయడం సునాయాసం అవుతుందని కేసీఆర్ భావించారు.

వచ్చే ఎన్నికల కూటమిపై తేల్చి చెప్పేసిన మమతా దీదీ
కానీ అందుకు భిన్నంగా మమత బెనర్జీ వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోదని, తమ పొత్తు ప్రజలతోనేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ 2024 ఎన్నికలలో కేవలం ప్రజలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళతామే తప్ప, ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయబోమని ఆమె బల్ల గుద్ది మరీ చెప్పారు.

మమతా బెనర్జీ విషయంలో కేసీఆర్ ఆశలు అడియాశలైనట్టేనా ?
ఇక ఇంత బలంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోమని చెప్పిన మమతా బెనర్జీ గురించి కేసీఆర్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరే అన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా బిజెపి మీద విపరీతమైన ఆగ్రహంతో ఉండే మమతా బెనర్జీ, ఒకే విధమైన పోరాట పంధా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ముందుకు నడుస్తారు అని కేసిఆర్ భావిస్తే, అంత సీన్ లేదు అని చెప్పి మమతా బెనర్జీ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పడంతో ఇది కేసీఆర్ ను ఆలోచించేలా చేస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల కోసం చేస్తున్న ప్రయత్నాలలో అడుగడుగునా ఆటంకాలు, రకరకాల సమస్యలు ఉత్పన్నం కావడం కేసీఆర్ తన ప్లాన్ లో ఏ మేరకు సక్సెస్ అవుతారు అన్న ఉత్కంఠను ప్రతి ఒక్కరిలో కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications