ఇద్దరు కలిసి చోరీలు: జైలు పాలు చేశాడనే కక్షతో హత్య (ఫొటో)
హైదరాబాద్: తాను జైలు పాలుకావడానికి కారణమయ్యాడనే కక్షతో ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని బహదుర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా గుర్తించారు. అయితే నిందితులు చిక్కడంతో పోలీసులు కేసు చిక్కు ముడి విప్పారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తన కార్యలయంలో కేసు వివరాలను వెల్లడించారు. కాలపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీవన్లాల్ మిల్ ప్రాంతంలో నివసిచే జావెద్ ఖాన్ అలియాస్ జాదు(22), మహ్మమద్ షాబాజ్ స్నేహితులు.
గతంలో వీరిద్దరు కాలపత్తర్, హుస్సేనిఅలం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేశారు. అయితే, ఆయా కేసుల్లో హుస్సేనిఅలం పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. అయితే, తాను జైలుకు వెళ్లడానికి షాబాజే కారణమని కక్ష పెంచుకున్న జావెద్ఖాన్ ఎలాగైనా పగ తీర్చుకోవాలని పథకం వేశాడు. జైలు నుంచి వచ్చాకా గత నెల 29న జావెద్ఖాన్ నివసించే ప్రాంతంలోనే ఉండే విద్యార్థి ఇంజమాముల్లా (19)కు తన ప్లాన్ తెలిపి ఎలాగైనా షాబాజ్ను అంతమెందించాలని నిర్ణయించుకున్నారు.
అదే రోజు రాత్రి మాట్లాడాలని చెప్పి షాబాజ్ను వారు మీర్ అలం ఫిల్టర్ సమీపంలోని దానమ్మ జోపిడి ప్రాంతానికి రప్పించారు. అక్కడి నుంచి రాత్రి ఒంటి గంట సమయంలో మీర్అలం చెరువు సమీపంలోని నెక్లెస్ రోడ్డుకు షాబాజ్ను తీసుకెళ్లిన జావెద్ఖాన్, ఇంజమామూల్లా పదునైన కత్తితో అతడి గొంతు కోశారు. చనిపోయినట్లు ధ్రువీకరించుకున్న తర్వాత వెళ్లిపోయారు.
తెల్లవారు జామున మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బహదుర్పురా పోలీసులకు సమచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బహదుర్పురా, దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టడంతో నిందితులు పట్టుబడ్డారు.
ఇప్పటికే జావెద్పై ఏడు కేసులున్నాయని ఏసీపీ తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో బహదుర్పురా ఇన్స్పెక్టర్ హరీష్కౌశిక్ పాల్గొన్నారు.