మిత్రుడి కూతురిపై అత్యాచారయత్నం: మత్తు చల్లి దోచేశారు
వరంగల్/ హైదరాబాద్: కన్ను మిన్ను కానకుండా ఓ వ్యక్తి మిత్రుడి కూతురిపైనే అఘాయిత్యానికి ప్రయత్నించాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో స్నేహితుడి కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
భూపాలపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు నాంపల్లి వెంకటేశ్వర్లు తన మిత్రుడు కూతురు (14)ని ఆదివారం బైక్పై పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేయబోయాడు. దాంతో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, ఇంటి ముందు కూర్చుని ఉన్న మహిళ ముఖంపై గుర్తు తెలియని దుండగులు మత్త మందు చల్లి ఆమె ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన హైదరాబాదులోని చాదర్ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని అక్బర్బాగ్ న్యాయమూర్తుల కాలనీలో మంగళవారం జరిగింది.
కాలనీలోని పిఎన్ఆర్ అపార్టుమెంటు ఎదురుగా ఉన్న తన ఇంటి ముందు కూర్చుని ఉన్న వరలక్ష్మి (25) అనే మహిళ ముఖంపై బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు చల్లారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోగా ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.