కత్తులతో పొడిచి మర్మాంగాలు కోసి చంపేశారు: ప్రేమ వివాహమే కారణమా?
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సచివాలయ నగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న లలిత్ (25) అనే యువకుడి ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు.
గాఢ నిద్రలో ఉన్న అతడిని బయటకు లాక్కొచ్చి అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి మర్మాంగాలను కోసి చంపేశారు. అనంతరం పక్కనే ఉన్న పూలకుండీలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో లలిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.
ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వనస్థలిపురం ఏసీపీ భాస్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడు 2015 నవంబరులో నగరంలోని రాగన్నగూడకు చెందిన సుస్మిత రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత లలిత్కు గుజరాత్లో ఉద్యోగం రావడంతో అక్కడే నివాసం ఉన్నాడు. రెండు నెలల క్రితం ఉద్యోగం వదిలేసి వనస్థలిపురం వచ్చేసిన లలిత్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు.
గత నెలలో సచివాలయ నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో సుస్మిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వనస్థలిపురం ప్రాంతంలో ఇటీవల కొంత కాలం క్రితం వరకు చైన్ స్నాచింగుల కలకలం ఎక్కువగా ఉంది.
కానీ, ఇప్పుడు లలిత్ హత్య జరగడం వనస్థలిపురంలో తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ హత్యకు ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య తరుపు బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.
గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న టాటా సుమోలో వచ్చి ఆరుగురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో లలిత్ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి అడ్డుకోబోయాడు. అతిడిని బెదిరించడంతో పక్కకు తప్పుకున్నాడు.
లలిత్ గుజరాత్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తరచూ హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాడు. మూడు నెలల్లోనే తన కొడుకుని పొట్టన బెట్టుకున్నారని మృతుడి తల్లి వాపోయింది. సుష్మిత నాయనమ్మ కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పిందని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు.
లలిత్ను అత్యంత దారుణంగా కళ్లలో కత్తులతో పొడిచి, మర్మాంగాలను కోసి హత్య చేయడం వెనుక సుష్మిత కుటుంబ సభ్యుల పాత్ర ఉందా? లేదా ఏమైనా సుపారీ గ్యాంగ్ హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సుష్మిత కుటుంబ సభ్యులను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.