కలెక్టర్, ఎస్పీలనే బుట్టలో వేశాడు: 'ఐక్యరాజ్య సమితి' ప్రతినిధినంటూ మోసం
ఖమ్మం: తాను ఐక్యరాజ్య సమితి ప్రతినిధిని అని చెప్పుకుంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన వ్యక్తిని ఖమ్మం జిల్లా పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. అతను పదో తరగతి వరకే చదివాడు. కానీ అతను కలెక్టర్, ఎస్పీ వంటి వారిని కూడా బుట్టలో వేశాడు.
స్వచ్ఛ భారత్, ఓటరు చైతన్యం వంటి పలు కార్యక్రమాల్లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి హోదాలోనే పాల్గొన్నాడు. నిరుద్యోగులను మోసగించి పోలీసులకు చిక్కడంతో అతని బండారం బయటపడింది. గురువారం పోలీసులు నిందితుడి గురించి వివరాలు వెల్లడించారు.
కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాలకు పక్కనున్న ఓ భవనం వద్ద నిరుద్యోగులు ఇటీవల గొడవకు దిగారు. పోలీసులు విచారణ జరపడంతో అతని గుట్టు రట్టయింది. నిందితుడి పేరు సునీల్ కుమార్.
కలెక్టర్, ఎస్పీ భవనాలను ఆనుకొని ఆన్న భవనాన్ని అద్దెకు తీసుకొని ఐక్యరాజ్య సమితి పేరుతో కార్యాలయం తెరిచాడు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించి యూనైటెడ్ స్కూల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యుడిగా చేరాడు.
అప్పటి నుంచి వరంగల్, ఖమ్మం నగరాల్లో విద్యా సంస్థల్లో ఆ సంస్థ తరఫున సదస్సులు నిర్వహించి కమీషన్ తీసుకునేవాడు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగిగా పరిచయం చేసుకున్నడు. జిల్లా ఉన్నతాధికారులతోను సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
ఎలక్షన్ వాచ్ కన్వీనర్గాను తిరిగాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏడుగురు ఉద్యోగుల నుంచి రూ.19 లక్షలు తీసుకున్నాడు. దీంతో అతని మోసం బయటపడింది. అతను ఎంఏ వరకు చదివిట్లు చెబుతున్నాడు. కానీ పదో తరగతికి మించి మెమోలు లేవు.