భార్యను హత్య చేసిన భర్త: వైద్యం వికటించి వ్యక్తి మృతి
హైదరాబాద్: కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపాడో భర్త. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొలిమిచెలమ గ్రామంలో చోటు చేసుకుంది. ఏడాది కాలంగా వెంకటేశ్, అంకం శారద(27)ల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.
శనివారం కూడా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశంలో సహనాన్ని కోల్పోయిన వెంకటేశ్ తన భార్య శారదను గొంతునులిమి హత్య చేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెను అల్లుడు వెంకటేష్ గొంతు నులిమి చంపాడని మృతురాలి తండ్రి స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మృతురాలి శారదకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదుచేసుకున్న దండేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్, వ్యక్తి మృతి
మహబాబు నగర్ జిల్లాలోని గట్టు మండలం టారాపురం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ఆంజనేయులు అనే రైతు శనివారం ఉదయం తన నివాసంలో తన సెల్ఫోన్కు విద్యుత్ ఛార్జీ పెడుతుండగా కరెంట్ షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడి కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.
వైద్యం వికటించి వృద్ధుడు మృతి
వైద్య వికటించి వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని శ్రీపతినగర్కు చెందిన వల్లాల రాములు(65) అనే వృద్ధుడు వైద్యం వికటించి శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు.
ఛాతీలో నొప్పి రావడంతో ఉదయం స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించుకున్నాడు. దీంతో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందాడు. వైద్యం వికటించే రాములు మృతిచెందాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.