మాదిగలకు క్యాబినెట్ లో స్థానం లేదు ... ఆవేదన దీక్షలకు పిలుపునిచ్చిన మందా కృష్ణ మాదిగ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించలేదు. దీంతో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో 12శాతం ఉన్న మాదిగలకు స్థానం కల్పిచకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు . 21న వరంగల్ జిల్లాలోని హన్మకొండ కేడీసీ మైదానంలో మాదిగలు, ఉప కులాలపై ప్రభుత్వం చూపించే వివక్షపై ఆవేదన వ్యక్తం చేసేందుకు 'ఆవేదన దీక్ష' చేస్తామన్నారు.
మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ ప్రభుత్వ పని తీరు వుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి మాదిగ, ఉప కులాలపై వివక్ష చూపుతున్నారని , అందుకే మంత్రిగా అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగ ఉప కులాలపై నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతంలో పని చేసిన సీనియర్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపడం మాదిగలపై వివక్ష చూపడం కాదా అని మందా కృష్ణ మాదిగ పేర్కొన్నారు . 12 శాతం ఉన్న మాదిగ, ఉప కులాలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పిన ఆయన కేవలం ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు కేటాయించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

ఇక ఆందోళనల బాట పడతామని చెప్పిన ఆయన బుధవారం నుంచి ఈ నెల15 వరకు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీల ముందు, 16న తహశీల్దార్ కార్యాలయల ముందు నిరసన దీక్షలు చేపడతామన్నారు. 18న అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ కార్యకమం కోసం ఛలో వరంగల్ కి పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలపాలని మందకృష్ణ కోరారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేస్తున్న ఈ దీక్షకు అన్ని వర్గాల మద్దతు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications