వారిది గల్లీలో కుస్తీ; ఢిల్లీలో దోస్తీ: కేసీఆర్ అవినీతిపైనా.. బీజేపీ టార్గెట్ గా మాణిక్కంఠాకూర్
నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న నవ సంకల్ప చింతన్ శిబిర్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ చింతన శిబిర్ సమావేశంలో కాంగ్రెస్ మేధోమథన సదస్సు జరగనుంది. అంతే కాదు పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి, వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చ జరగనుంది. ఇక పార్టీకి దిశానిర్దేశం చేసే చింతన్ శిబిర్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై, బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరూ మంచి స్నేహితులు అని తెలిపిన మాణిక్కం ఠాగూర్ వీరిద్దరు గల్లీలో కుస్తీ.. ఢిల్లీ లో దోస్తీ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. లేదంటే బిజెపి నేతలు కేసులు పెడతామని టిఆర్ఎస్ పార్టీ అవినీతిపై ఒక కేసు కూడా పెట్టలేదు అంటూ పేర్కొన్నారు. కెసిఆర్ అవినీతి చిట్టా ఉందని చెబుతున్న బీజేపీ నేతలు కేసులు పెట్టకపోవడం వెనుక మతలబేంటి అని మాణిక్కం ఠాకూర్ ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు అనేక అంశాలపై, టిఆర్ఎస్ పార్టీ అవినీతి చిట్టా సమర్పించినా ఇప్పటివరకు ఎందుకు స్పందన లేదని ప్రశ్నించారు. ఇక బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయితే ఈడీ, సిబిఐ కేసులు పెడుతున్నారంటూ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఇప్పటికే అనేకమార్లు బీజేపీ అగ్రనాయకులు తెలంగాణాకు వచ్చిన క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బిజెపి నాయకులు తోడు దొంగలని విమర్శించారు. వారిని ప్రజలు నమ్మబోరని తేల్చిచెప్పారు.
రాహుల్ గాంధీ సమావేశం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మంచి జోష్ తో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 1,2 వ తేదీలలో చింతన్ శిబిర్ నిర్వహించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి తనవంతుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రయత్నం చేస్తున్నారు.