అర్ధరాత్రి తెగబడ్డ మావోలు: ఇద్దరిపై కాల్పులు, ఒకరు మృతి, వాహనాల దగ్ధం
భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డారు. ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అర్ధరాత్రి పినపాక మండలం వీరాపురంలో పాడెం జోగయ్య అనే వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. మరోవైపు భద్రాచలంలోని సుందరయ్యనగర్లో రమేశ్ అనే వ్యక్తిపైనా కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ సదరు వ్యక్తి చేతికి బుల్లెట్ గాయంతో మావోయిస్టుల బారి నుంచి తప్పించుకోగలిగాడు.

తీవ్రగాయాలైన రమేశ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఇన్ఫార్మార్లనే నెపంతోనే వీరిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరిని మాజీ మావోస్టులుగా గుర్తించారు.
భూపతిరావుపేటలో నాలుగు లారీలు, రెండు జేసీబీలను సైతం దహనం చేశారు. ఇసుక క్వారీలోని ఇద్దరు కూలీలను తీసుకెళ్లి మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. ఇసుకను అక్రమంగా తలరిస్తున్నారంటూ ఓ లేఖ వదిలివెళ్లారు. ఈ ఘటనలో మొత్తం 40మంది వరకు మావోయిస్టులు మూడు బృందాలుగా విడిపోయి ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications