ఇన్ఫార్మర్లకు వణుకు పుట్టేలా మావోల ఘాతుకం; ములుగులో ఇన్ఫార్మర్ను హతమార్చి లేఖలో సీరియస్ వార్నింగ్
తెలంగాణాలో తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్న మావోయిస్ట్ పార్టీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని, పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని మావోయిస్టు పార్టీ తాజాగా ఓ ఘాతుకానికి ఒడిగట్టింది. ములుగు జిల్లాలోని వెంకటాపురం లో ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టు పార్టీ వాజేడు ఏరియా దళ సభ్యులు మట్టుబెట్టారు.

ఇన్ఫార్మర్ అంటూ వ్యక్తిని నరికి చంపిన మావోయిస్టులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామం లోని గోపాల్ అనే వ్యక్తిని మావోయిస్టులు అత్యంత దారుణంగా నరికి చంపారు. గ్రామ పొలిమేరలోకి తీసుకువెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి, గొడ్డలితో నరికి చంపారు. గోపాల్ మృతి చెందిన తర్వాత లాల్ సలాం అంటూ నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టు ఈ ఘటనపై స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు.

మావోల లేఖలో వారికి హెచ్చరిక
మావోయిస్టుల కార్యకలాపాల గురించి పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారంటూ, దీంతో అతనిని హతమార్చినట్టు మావోయిస్టులు వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఒక లేఖ వదిలి వెళ్లారు. ఇక ఈ లేఖలో ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఎవరైనా సరే ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తే సహించేది లేదని, ఇన్ఫార్మర్ గా వ్యవహరించే వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు ఆ లేఖలో హెచ్చరించారు.

డీజీపీ పర్యటించిన నెలలోపే మావోల ఘాతుకం
అంతే కాదు ఆ లేఖలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చాలా మందిని కాల్చి చంపారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఇటీవల మావోయిస్టుల సంచరిస్తున్నారు సమాచారంతో డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు ప్రాంతంలోని తెలంగాణ సరిహద్దుల్లో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడడం ప్రస్తుతం కలకలం గా మారింది.

ఇన్ఫార్మర్లకు వణుకు... కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
ములుగు జిల్లాలో చాలా ఏజెన్సీ గ్రామాలలో పోలీసులు మావోయిస్ట్ ల కదలికలు తెలుసుకోవటం కోసం ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న ఇన్ఫార్మర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications