ఆస్తి కోసమే అమృత డ్రామాలు..నేను విలన్ అవడానికి కారణమదే..: మారుతీరావు సోదరుడు శ్రవణ్
తండ్రి మారుతీరావు ఆత్మహత్య విషయంలో అమృత ప్రణయ్ తనపై అనుమానం వ్యక్తం చేయడాన్ని శ్రవణ్ కొట్టిపారేశారు. ఆస్తి కోసమే ఆమె డ్రామాలు ఆడుతోందన్నారు. అమృతను అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్నారన్న దానిపై.. ఆమెకు అసలు తండ్రిపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఉంటే.. శనివారమే మారుతీరావు మృతదేహాన్ని చూసేందుకు వచ్చేదన్నారు. ఒకప్పుడు మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్తని అమృత మాట్లాడిందన్నారు. ఏ కూతురైనా తల్లీ తాళి తీయాలని కోరుకుంటుందా అని ప్రశ్నించారు.
Recommended Video
ఆత్మహత్య బాధనిపించింది.. శ్రవణ్పై అనుమానాలు.. అమ్మకు అతనితో ప్రాణహాని: అమృత ప్రణయ్
అమృతతో రాజీ ప్రసక్తే లేదు..
అమృత పరిణితి లేని అమ్మాయి అని.. కాబట్టి ఆమె చేసే ఆరోపణల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. తనవల్ల అమృత తల్లికి ప్రాణహాని ఉందనడాన్ని తప్పు పట్టారు. తల్లీకూతుళ్లను విడదీయాలని తాను భావించట్లేదన్నారు. మారుతీరావు ఆస్తిలో తనకు ఒక్క పైసా అవసరం లేదని.. తన సంపాదన తనకు బాగానే ఉందన్నారు. తనపై పెట్టిన కేసుల విషయంలో రాజీకి రావాలని తాను అమృతను కోరనని.. చట్టపరంగా శిక్ష పడితే దేనికైనా సిద్దమని చెప్పారు.
విలన్ కావడానికి కారణమదే..
మారుతీరావును తాను కొట్టానని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు శ్రవణ్. తనపై ఎవరైనా ఏదైనా చెప్పినా మారుతీరావు వారినే అడ్డగోలుగా తిట్టేవాడన్నారు. తనపై ఆయనకు చాలా నమ్మకం అన్నారు.
చిన్నప్పటి నుంచి తాను అమృతకు విలన్ కావడానికి వేరే కారణం ఉందన్నారు. మారుతీరావు అమృతను ఎప్పుడూ చిన్న మాట కూడా అనేవాడు కాదని.. కనీసం గట్టిగా కూడా ఎప్పుడూ మాట్లాడకపోయేవాడని చెప్పారు. అమృతను మందలించడం ఇష్టం లేక.. 'అలా చేస్తే బాబాయ్ ఒప్పుకోడు.. ఇలా చేస్తే బాబాయ్ కోప్పడుతాడు..' అని తన పేరును అడ్డం పెట్టేవాడని అన్నారు. దాంతో చిన్నప్పటి నుంచి అమృత దృష్టిలో తనపై సరైన అభిప్రాయం లేదని.. అందుకే తనను విలన్గా భావిస్తోందని చెప్పుకొచ్చారు.
అకారణంగా జైలుకు వెళ్లినందుకే
తన అన్న కారణంగా అనవసరంగా జైలుకు వెళ్లానన్న బాధతోనే ఆయనతో మాట్లాడటం మానేశానని చెప్పారు. హత్య కేసు కారణంగా తన పిల్లలు,కుటుంబం ఇబ్బందులు పడుతున్నామన్నారు. పిల్లలకు సంబంధాలు రావు.. సమాజంలో పరువు పోయిందన్న ఉద్దేశంతోనే మారుతీరావుతో మాట్లాడటం మానేసినట్టు చెప్పారు. వీలునామాలో మారుతీరావే తన పేరు రాయించాడని.. తానేమీ రాయమని కోరలేదన్నారు.
తానే పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించి వీలునామాలో తన పేరు తొలగించేలా చేశానన్నారు.
బెదిరించి భూములు లాక్కున్నా.. ముందుకు రండి..
మారుతీరావు గొప్ప తండ్రి అని.. ఆయన్ను పోగొట్టుకోవడం అమృత దురదృష్టమని శ్రవణ్ అన్నారు. తన అన్న ఎవరికైనా అప్పు ఉంటే.. వారు తనను సంప్రదించాలని.. వడ్డీతో సహా వాటిని తీర్చేస్తానని చెప్పారు.
తనకు తెలియకుండా మారుతీరావు ఎక్కడా అప్పు చేయలేదని.. అయినా సరే, ముందుకొస్తే అప్పు తీర్చేస్తానని తెలిపారు. ఒకవేళ తాము ఎవరినైనా బెదిరించి భూములు లాక్కుంటే.. వాళ్లు కూడా ముందుకు రావాలని.. తీసుకున్నది ఇచ్చేస్తామని చెప్పారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని.. ఎవరి ఆస్తులు వాళ్లం ఎప్పుడో పంచుకున్నామని చెప్పారు. వకీళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేక మారుతీరావు సతమతమయ్యాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.