తప్పిపోయి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన యువకుడు
మహబూబ్నగర్: ఆశలు వదులుకున్న స్థితిలో ఓ మితిస్థిమితం లేని యువకుడు తప్పిపోయి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా వెల్దండలో చోటు చేసుకుంది. కాన్గుల కృష్ణయ్య ఆలియాస్ గున్నీ అనే వ్యక్తి ఇంటి నుంచి తప్పిపోయి 18 ఏళ్ల తర్వాత తిరిగి స్వగ్రామం వెల్దండకు చేరుకున్నాడు.
వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాన్గుల పుల్లయ్య, చంద్రమ్మలకు ముగ్గురు సంతానం, పెద్దకొడుకు నర్సిహ, కుతూరు లక్ష్మీదేవి, రెండో కుమారుడు కృష్ణయ్య ఆలియాస్ గున్న. 18 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కృష్ణయ్య మతి స్థిమితం కోల్పోయి ఇంటి నుంచి తప్పిపోయాడు.
ఎంతగా వెతికినా అతని జాడ కనిపించలేదు. 16 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన కృష్ణయ్య ఇప్పటి వరకు జాడ లేదు. మహారాష్ట్రంలోని ఖర్జత్ నియోజకవర్గం గిర్గావ్ గ్రామంలో శ్రద్ధ బిలిటేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారికి 3 నెలల క్రితం కృష్ణయ్య కన్పించాడు.
దీంతో అతన్ని చేరదీసి స్థానికంగా ఉన్న గుంజీ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే సంస్థ ఆధ్వర్యంలో సుమారు 4 వేల మందికి చికిత్సలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. చికిత్స అనంతరం ఆరోగ్యంగా మారిన కృష్ణయ్య సంస్థ సభ్యులకు తన స్వగ్రామం వివరాలు చెప్పాడు.
దీంతో స్వచ్ఛంద సంస్థ వారు మంగళవారం కృష్ణయ్య ఆలియాస్ గున్నీని వెల్దండలోని స్వగృహానికి తీసుకొచ్చి గ్రామ సర్పంచ్, పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.