Weather Update: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!
తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రం మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం వెంట కేరళ తీరం వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈ ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.
ఉపరితల ఆవర్తనంతో గురువారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

శనివారం కూడా హైదరాబాద్ తో పాటు జగిత్యాల, జె.భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, హన్మకొండ, ములుగు, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈసారి వర్షాలు అనుకున్న స్థాయిలో కురవడం లేదు.
ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సరైన వర్షపాతం నమోదు కాలేదు. గోదావరి బేసిన్ లోని శ్రీరాంసాగర్, ఎల్లింపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు నిండ లేదు. కృష్ణా బేసిన్ లో మాత్రం ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ పూర్తిగా నిండాయి.












Click it and Unblock the Notifications