అందరి బంధు సీఎం కేసీఆర్; మాట తప్పడు మడమ తిప్పడు: మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు!!
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు. సీఎం కెసిఆర్ అందరి బంధువు అని, ఆయన సబ్బండ వర్ణాలకు సహాయంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ చెప్పినట్టు త్వరలోనే గిరిజనులకు పంచాయతీ రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకం అమలవుతుందని తేల్చిచెప్పారు.

కేసీఆర్ మాటంటే మాటే ... కచ్చితంగా చేస్తారన్న మంత్రి ఎర్రబెల్లి
సిఎం కెసిఆర్ మాట తప్పరు.. మడమ తిప్పరు అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన మాట అంటే మాటే. కచ్చితంగా చేస్తారు అని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ లాంటి సిఎం మనకు దొరకడం నిజంగా అదృష్టమని అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పాలకుర్తి నుండి వచ్చిన గిరిజన నేతలతో మంత్రి వ్యాఖ్యలు
సిఎం కెసిఆర్ ఇటీవల చేసిన, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు ప్రకటన పట్ల మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలపడానికి పాలకుర్తి నియోజకవర్గం నుండిహైదరాబాద్ కు తరలి వచ్చిన గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి ఆరోపణలు
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల కోసం ఆరేళ్ళ క్రితమే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ బిల్లుని కనీసం పట్టించుకోలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఆ బిల్లే తమ వద్దకు రాలేదని బుకాయించారని, చివరకు వచ్చిందని చెప్పారని కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. అయితే, ఇటీవల గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ సంత్ సేవాలాల్, కుమరం భీం భవనాలను హైదరాబాద్ లో ప్రారంభించిన సమయంలో సిఎం కెసిఆర్ కేంద్రానికి గట్టిగా చెప్పారని, కేంద్రం కాదన్నా, మన రాష్ట్రంలో గిరిజనుల కోసం 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికిసిద్ధంగా ఉన్నారని తెలిపారు.

దళిత బంధులా గిరిజన బంధు.. కేసీఆర్ కు అండగా ఉండాలన్న మంత్రి
అలాగే దళిత బంధు లాగే, గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ పట్ల మనమంతా కృతజ్ఞతతో, అండగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. దేశంలో ఇలాంటి సిఎంలు లేరని, ప్రజలందరి కోసం ఆలోచిస్తున్న సీఎం కెసిఆర్ అంటూ ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు అవసరమైనప్పుడు కెసిఆర్ కు అండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications