చేతులెత్తి మొక్కుతా.. హుందాగా ప్రవర్తించండి; గవర్నర్ పై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు . వరంగల్ జిల్లా రాయపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన తమిళి సై గవర్నర్ పదవికి తగ్గ విధంగా హూందాగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారని, గవర్నర్ బిజెపి కార్యకర్తలా వ్యవహరించడం తగదని మంత్రి పేర్కొన్నారు.

గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారు
గవర్నర్ తన పదవికి తగ్గట్టు హుందాగా ప్రవర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ గా హూందాగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. గౌరవనీయులైన గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గవర్నర్ ప్రవర్తన ప్రజలను బాధిస్తుందని వ్యాఖ్యానించారు. గవర్నర్ తమిళిసై ని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నామని, కానీ ఆమె బిజెపి డైరెక్షన్లో పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.

బీజేపీ నాయకులను, కార్యకర్తలను వెంటేసుకుని తిరుగుతున్నారు
గవర్నర్ రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీ నాయకులను, కార్యకర్తలను వెంటేసుకుని తిరగడం దేనికి సంకేతమో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. రోజు రోజుకి ఆమె తన హుందాతనాన్ని కోల్పోతున్నారని, గవర్నర్ వ్యవస్థను కించపరచడం వల్లే ఆమె తగిన గౌరవాన్ని పొందలేకపోతున్నారు అని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కించపరుస్తూ తిరగడం దేనికి అని ప్రశ్నించారు.

ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తూ తెలంగాణాను అవమానిస్తున్నారు
మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులుగా కనీసం తమకు కూడా ఇవ్వలేదని, మేడారం జాతరలో అవమానించారని చెబుతున్నారని గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యశాలలపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇస్తున్న మెరుగైన వైద్యం, దేశంలోనే మరెక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చి గవర్నర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

పదవికి వన్నె తెచ్చేలా గవర్నర్ ప్రవర్తించాలి
అసలు ప్రధాని నిర్వహించే సమావేశాలకు గవర్నర్ కి ఎందుకు వెళ్లాలో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు గవర్నర్ పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తిస్తే బాగుంటుందని హితవు పలికారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. గవర్నర్ పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తించాలని నేను చేతులెత్తి మొక్కుతున్నానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .












Click it and Unblock the Notifications