వారివి బోగస్ మాటలు.. కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్, బిజెపి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా వున్నట్టు వ్యాఖ్యలు చేసిన ఆయన కాంగ్రెస్, బీజేపీ లను టార్గెట్ చేశారు.
దేశంలో ఎక్కడ లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, కెసిఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పటిష్ఠంగా ఉంచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రైతులకు ఎదురు పెట్టుబడి పెట్టిన మహానుభావుడు కెసిఆర్ అంటూ కొనియాడారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఎక్కడైనా వస్తుందా అంటూ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కెసిఆర్ కిట్ ఎక్కడైనా ఇస్తున్నారా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు మరెక్కడా లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుకు వీలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్ని రోజులు దోపిడీ చేశారని, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నారు. బిజెపి బడా జూటా మాటలను కూడా నమ్మొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఊరికి ఒకరిద్దరు మోపయ్యారని, వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకోసం ఆలోచించిన ముఖ్యమంత్రులు అప్పుడు ఎన్టీ రామారావు ఇప్పుడు మన కెసిఆర్ అంటూ పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం రైతులకు రెండు వేలు ఇస్తే కెసిఆర్, ఎకరానికి 10000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నాడని పేర్కొన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కేంద్రాన్ని వ్యతిరేకించి మోటార్లకు మీటర్లు పెట్టనని సవాల్ చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.