తెలంగాణా అభివృద్ధి ఓర్వలేక విమర్శలు; రైతుల నడ్డి విరిచేలా బీజేపీ కుట్రలు: మంత్రి ఎర్రబెల్లి
రైతుల నడ్డి విరిచేలా బిజెపి కుట్రలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక బిజెపి కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విమర్శలు చేసే ముందు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో 14 కోట్ల 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ తర్వాత తొర్రూరు జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో వంద అడుగుల ఎత్తుతో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద వంద అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. పదిహేను రోజుల పాటు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ జెండాను నిర్మాణం చేశారని, దీని నిర్మాణానికి సుమారు 20 లక్షల రూపాయల ఖర్చు చేయడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 30 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో జెండా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

బిజెపి, కాంగ్రెస్ లు అనవసరపు విమర్శలు చేస్తున్నాయి: మంత్రి ఎర్రబెల్లి
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ లు అనవసరపు విమర్శలతో, ఆరోపణలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారు అని విమర్శించారు. బిజెపి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలు వాటిని పట్టించుకోవద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

కేసీఆర్ ది రైతు సంక్షేమ పాలన, బీజేపీది రైతుల నడ్డి విరిచే పాలన
200 రూపాయలు ఉన్న పింఛనును 2016 రూపాయలు, ఇప్పుడు 3016 రూపాయలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి తో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, మన ఊరు మన బడి తో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అన్ని రంగాలలో సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే, రైతుల నడ్డివిరిచేలా బీజేపీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications