స్వాతంత్రోద్యమంలో బిజెపి పాత్ర ఉందా? టూరిస్టుల్లా వచ్చిపోతున్న మంత్రులు: ఎర్రబెల్లి ఫైర్!!
జాతిపిత గాందీజీని చంపిన గాడ్సే వారసులెవరో బిజెపి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, యువకులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు, పార్టీ శ్రేణులతో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
స్వాతంత్రోద్యమంలో బీజేపీ పాత్ర ఏంటి? ప్రశ్నించిన మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంలోని అధికార బీజెపీని టార్గెట్ చేస్తూ స్వాతంత్రోద్యమంలో బిజెపి పాత్ర ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపికి ఏం సంబంధం ఉందని ఆయన నిలదీశారు. అజెండాలేని జెండాలతో తెలంగాణపై బిజెపి దండయాత్ర చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మన తెలంగాణను, మన సీఎం ను కాపాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
టూరిస్టుల మాదిరిగా రాష్ట్రానికి వస్తున్నారు పోతున్నారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భారతీయ జనతా పార్టీకి కనీసం స్వాతంత్య్ర వారసత్వం గానీ, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం గానీ లేదన్నారు. లేనిపోని అజెండాలతో జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాలను పనిగట్టుకుని పెట్టుకుని తెలంగాణపై ఆ పార్టీ దండయాత్ర చేస్తోందన్నారు. రాష్ట్రానికి రావచ్చు.. పోవచ్చు. దాన్ని ఎవరూ తప్ప పట్టరని, కానీ బిజెపి నేతలు టూరిస్టుల్లా అదే పనిగా మన రాష్ట్రానికి వస్తూ, మన మధ్య మత తత్వ చిచ్చు పెట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి లేని పోని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారు
విలీనం, విమోచనం పేరుతో ఇక్కడి ముస్లీం, హిందూ ప్రజల మధ్య లేనిపోని ఘర్షణ లను రెచ్చగొడుతున్నారన్నారు. అందుకే సీఎం కెసిఆర్ ప్రస్తుతం అందరూ సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మూడు రోజులపాటే గాకుండా, ఈ ఏడాదంతా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారన్నారు.
బీజేపీ మాయలో పడకండి
ఇప్పటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నందునే మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో, మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఐటీ రంగంతోపాటు అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని, దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని మంత్రి తెలిపారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏదోవిధంగా అడ్డుకోవడానికి బిజెపి కుట్ర పన్నుతుందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.వారి మాయలో పడొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
బీజేపీ అజెండా ప్రభుత్వాలను కూల్చటమే
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బిజెపికి అభివృద్ధి అజెండా లేదన్నారు. రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని విమర్శించడం, విద్వేషాలు రెచ్చగొట్టడమే తప్ప మరో అజెండా లేదన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి, తమ పార్టీని ఏర్పాటు చేయడం తప్ప మరోపనే లేదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో బిజెపి వంటి విద్వేష పూరిత పార్టీ లేనేలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని, ప్రజలు బిజెపి కుట్రలను గమనించాలని సూచించారు.