కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆ పని చేస్తే సన్మానం చేస్తానన్న మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొనసాగుతుంది. వరి సాగు విషయంలో మొదలైన రగడ అధికార టీఆర్ఎస్ ధర్నాలు చేసే దాకా వెళ్ళింది. కేంద్రంతో తెలంగాణా సీఎం వైరం పెట్టుకుంటున్నాడు అన్న చర్చ తాజా పరిణామాలతో చోటు చేసుకుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణా బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు.
వరి సాగు విషయంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. రచ్చ
తెలంగాణ రాష్ట్రంలో రైతుల వరిసాగు వ్యవహారం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మధ్య రగడకు కారణంగా మారింది. తెలంగాణ రైతులు వరి సాగు చేస్తే ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం నిరాకరిస్తున్నదని, కనుక తెలంగాణ రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, వరి పండిస్తే కొనుగోలు చేసేది లేదని తెలంగాణ సర్కార్ తేల్చి చెబుతోంది. ఇదే సమయంలో బిజెపి తెలంగాణ రథసారథి బండి సంజయ్ రైతులు వరి పంట సాగు చేసుకోవచ్చని, ప్రభుత్వం మెడలు వంచి అయినాసరే ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామని తేల్చి చెప్పారు.కేంద్రంపై నింద మోపిన తెలంగాణ సర్కార్ పై మండిపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేనిపోని మాటలు చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ వడ్లు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ శుక్రవారం ధర్నా ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి గంగుల కమలాకర్
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై, తెలంగాణ రైతులు ధాన్యం కొనుగోలు పై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారంనాడు టిఆర్ఎస్ పార్టీ ధర్నాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ధర్నా ఏర్పాట్లపై బుధవారం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఆందోళనలలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొనాలని, వారిని సమన్వయ పరుచుకునే బాధ్యతలు నాయకులు చేపట్టాలని సూచించారు. రాజ్యాంగం ప్రకారం వడ్లు కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత గల కేంద్రం దాని నుండి తప్పించుకుంటున్న తీరును రైతులకు సమగ్రంగా వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
యాసంగిలో పండే పంట కేంద్రం కొనుగోలు చేసేలా బీజేపీ నేతలు ఒత్తిడి తెండి
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగి లో పండే ప్రతి పంట కొనేలా కేంద్రంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన ధర్నా చేసే పరిస్థితిని కేంద్రం తీసుకు వచ్చిందని ఆయన తెలిపారు. పంట కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేరువేరుగా మాట్లాడుతున్నారని దీనిపై స్పష్టత ఇవ్వడం కోసమే ధర్నాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రైతాంగం కోసం తాము చేస్తున్న ఆందోళనకు బిజెపి నేతలు కూడా మద్దతు తెలపాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
ప్రతీ గింజ కొనేలా ఉత్తర్వులు తీసుకొస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను సన్మానిస్తా
యాసంగిలో ఏ పంట పండినా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేలా కేంద్రం పై బిజెపి నేతలు ఒత్తిడి తేవాలని, కేంద్రం నుండి ప్రతీ గింజ కొనేలా ఉత్తర్వులు తీసుకొస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తానే సన్మానిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గంగుల కమలాకర్. తెలంగాణ రైతాంగానికి సహాయం చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం రైతు అనుకూల విధానాలను, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటుపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని గంగుల అసహనం వ్యక్తం చేశారు. గందరగోళంలో రైతులను పడేస్తున్నారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటు దోచిపెట్టే కుట్రలను చేస్తూ దొంగే దొంగ అన్నట్లుగా బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు.