నేడు సీబీఐ విచారణకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర!!
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సిబిఐ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర కూడా సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసి సిబిఐ ఆఫీస్ లో నేడు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు మంత్రి గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర సీబీఐ విచారణకు హాజరు కానున్నారు.
నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయగా, నేడు ఢిల్లీలో విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాదులో సిబిఐకి ప్రవేశం లేదన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో, సిబిఐ అధికారులు వారిని ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఈ దాడులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఫేక్ సిబిఐ అధికారి శ్రీనివాస్ తో సంబంధాలపై సీబీఐ విచారణను ఎదుర్కోబోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అరెస్టైన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో, గంగుల కమలాకర్ తో వున్న సంబంధాలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఉన్న సంబంధాల నేపథ్యంలో నేడు సీబీఐ అధికారులు వారిని విచారించనున్నారు. వారికి శ్రీనివాస్ తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? వారి ఎప్పుడెప్పుడు కలిశారు? కలిసిన సమయంలో ఏమి మాట్లాడుకున్నారు? వంటి వివరాలను సిబిఐ అధికారులు విచారించనున్నారు. ఇక సిబిఐ విచారణకు తాము సహకరిస్తామని ఇప్పటికే ప్రకటించిన గంగుల కమలాకర్ నేడు సిబిఐ ముందు హాజరు కానున్నారు. వద్దిరాజు రవిచంద్ర కూడా సిబిఐ విచారణకు సహకరించనున్నారు. ఈ విచారణలో గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర సిబిఐ అధికారుల ముందు ఏం చెప్పబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో విశాఖపట్నం చిన్న వాల్తేర్ కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావు ను ఫేక్ సిబిఐ అధికారిగా గుర్తించి ఇటీవల సిబిఐ అరెస్టు చేసింది. అతని అరెస్ట్ నేపధ్యంలో కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఉంది. నిందితుడు తనను తాను సిబిఐ అధికారిని అని చెప్పుకుంటూ సిబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్ గా రిటైర్ అయిన ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకుంటూ వివిధ వర్గాల నుండి డబ్బులు వసూలు చేసే వాడని తేలింది. నిందితుడికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో అధికార యంత్రాంగంతో, ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లుగా తేలింది. ఈ క్రమంలోనే అతని సంబంధాలను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు సీబీఐ అధికారులు.
మంత్రి గంగుల కమలాకర్ కు షాక్.. మొన్న ఈడీ దాడులు, ఇప్పుడు సిబిఐ నోటీసులు!!