బడ్జెట్ అంతా భ్రమ: హరీష్ రావు
ఇదో భ్రమల బడ్జెట్ అన్నారు. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జట్టే కాకుండా పేదల వ్యతిరేక బడ్జెట్ అంటూ హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల, రైతుల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో అంతా డొల్లే అని వ్యాఖ్యానించారు. రైతులను, అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్ అని అభివర్ణించారు. ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది సంవత్సరాల నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి అడుగుతున్న సమాధానం చెప్పడంలేదని, గిరిజన విశ్వవిద్యాలయానికి ఇచ్చిన నిధులు నామమాత్రమేనని, విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు, వారికి ప్రత్యేక ప్రోత్సాహాల ఊసే లేదని మండిపడ్డారు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎప్పటిలాగే ఈ బడ్జెట్లోనూ తెలంగాణకు మెండి చేయి చూపించారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వాడలకు సంబంధించి కొత్తగా కేటాయింపులు లేవని, బడ్జెట్లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టడంతోపాటు ఎరువులపై రాయితీ తగ్గించారన్నారు.

గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారని, ఆహార రాయితీలు తగ్గించారని, కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని మాట మాత్రంగా కూడా చెపపలేదన్నారు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు ఆశాజనకంగా లేవని, అంకెల గారెడీతో ఉద్యోగస్తులను కూడా భ్రమల్లో ఉంచారన్నారు. సెస్సుల భారం తగ్గించలేదని, పన్నుల భారం నుంచి ఉపశమనం లేదని, విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇదో భ్రమల బడ్జెట్ అన్నారు. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జట్టే కాకుండా పేదల వ్యతిరేక బడ్జెట్ అంటూ హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.
కేంద్రానిది సవతి తల్లి ప్రేమ..
ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై బీఆర్ఎస్ ఎంపీలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీయేనని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగానికి, వాస్తవ కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదని ఆక్షేపించారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించారన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులకు సంబంధించిన ఊసే లేదని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని.., రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో నిలదీస్తామని ఎంపీలు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications