కన్నకొడుకు చీర కొనివ్వకపోయినా, పెద్దకొడుకు కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నాడని సెలవిచ్చిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనకు కితాబిచ్చారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో పింఛన్ల డబ్బు పెరిగిందని, పింఛన్ల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు.
నూతన ఆసరా పెన్షన్ లు లబ్దిదారులకు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు
నూతనంగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు ఇక నుండి ప్రతి నెల నెలకు 2016 రూపాయల పింఛన్ అందుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 75 రూపాయల పింఛన్ మాత్రమే అందేదని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఎవరైనా చనిపోతే తప్ప వారి స్థానంలో కొత్త పింఛన్లు ఇచ్చేవారు కాదని పేర్కొన్న మంత్రి హరీష్ రావు నాడు ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు.
నాటి పెన్షన్ లకు పదింతలు పెంచి పెన్షన్ ఇస్తున్నామన్న మంత్రి హరీష్ రావు
చంద్రబాబు ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ 200 రూపాయలు చేసిందని పేర్కొన్న హరీష్ రావు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నాడు ఇచ్చిన పెన్షన్ కు పదింతలు పెంచి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో మార్పు జరిగిందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటు కాదు ఉత్త కరెంట్ అంటూ ఎద్దేవా చేశారు.
బతుకమ్మ చీరలను కేసీఆర్ ఇస్తున్నాడన్న మంత్రి హరీష్ రావు
ఇక ఉచితాలు వద్దంటున్న బిజెపికి బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కెసిఆర్ ది గజ్వేల్ నియోజకవర్గం కావడం మీ అందరి అదృష్టమని పేర్కొన్న హరీష్ రావు, పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని తేల్చిచెప్పారు. ఇక ఇదే సమయంలో కన్నకొడుకు చీర కొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తున్నాడని, అందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కెసిఆర్ ఆశిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
పేదలను కడుపులో పెట్టుకుని చూసే సీఎం కేసీఆర్ అంటూ కితాబు
బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా పేదలను ఆదుకున్నారని హరీష్ రావు తెలిపారు. పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి హరీష్ రావు తమ ప్రభుత్వ హయాంలో తూప్రాన్, మెదక్, గజ్వేల్ లో మంచి ఆసుపత్రులు వచ్చాయని, సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయని , పేదలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.