వారసత్వంపై హరీష్ రావు సమాధానం, దీక్ష చేస్తానని రేవంత్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుల శాఖ మంత్రి హరీష్ రావు వారసత్వంపై తనదైన శైలిలో స్పందించారు. కెసిఆర్కు వారసుడు ఎవరనే ప్రశ్న ఇటీవల రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మీడియాలో కూడా ఓ సమయంలో చర్చనీయంగా మారింది.
దీనిపై హరీష్ రావును విలేకరులు ప్రశ్నించారు. దానికి హరీష్ రావు మాట్లాడుతూ... మరో 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని, ఇక వారసుడు ఎవరన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుందని ఎదురు ప్రశ్నించారు. వారసుడిపై చర్చ అసందర్భమన్నారు.
పార్టీలో నెంబర్ గేమ్ సాగడం లేదన్నారు. తన అనుచరులకు పదవులు రావడం లేదన్న ప్రచారమూ వాస్తవం కాదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్.. తన తనయుడు కేటీఆర్కు ప్రాదాన్యం ఇస్తున్నాడనే ఊహాగానాలు ఇటీవల వస్తున్న విషయం తెలిసిందే.
దీక్ష చేస్తా: రేవంత్ రెడ్డి
కొమురవెల్లి మల్లన్న సాగర్ డ్యాం నిర్మాణంతో తమ భూములు లాక్కుంటున్నారంటూ మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రజలు ఆందోళన చేశారు. చావడానికైనా సిద్దం, మా భూములు ఇవ్వబోమంటూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు.
ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వాలని ఆయన బుధవారం నాడు డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారికి ఎకరానికి రూ.25లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా భూనిర్వసితులకు న్యాయం చేయకపోతే ఏటిగడ్డ కిష్టాపూర్లోనే 48 గంటల నిరసన దీక్ష చేపడతానని చెప్పారు.