సీఎం కేసీఆర్ నిప్పు.. బీజేపీ నేతలు ముట్టుకుంటే మాడి మసైపోతారు: మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కెసిఆర్ ని ముట్టుకుంటే కాలిపోతారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చలకు కేసీఆర్ రావాలా? ప్రశ్న
టీఆర్ఎస్ఎల్పీ లో మీడియాతో మాట్లాడిన ఆయన కెసిఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని మండిపడిన జగదీష్ రెడ్డి మిలట్రీ ఉందని కేసీఆర్ ని పట్టుకుపోతారా అంటూ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి సొంత ఊరికి వెళ్లినా కెసిఆర్ పాలన గురించి, బీజేపీ చేసిన నష్టం గురించి ప్రజలు చెబుతారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చలకు కేసీఆర్ రావాలా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

విద్యుత్ సంస్కరణలను అమలు చెయ్యకపోవటం వల్లే కేంద్రం ఇలా
విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ చేసిన వాదన తప్పు అంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డి చెబుతున్నారని, ఒప్పు అని మేము అంటున్నామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వారిద్దరూ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27 2021 నాడు రాష్ట్రానికి విద్యుత్ పాలసీని కేంద్రం పంపించిందని, దశలవారీగా అన్ని రంగాల్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ఆ పాలసీలో స్పష్టంగా ఉందని, ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం విద్యుత్ సంస్కరణలతో ముడి పెట్టిందని పేర్కొన్నారు.

విద్యుత్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్న జగదీశ్ రెడ్డి
కేంద్రం చెప్పినట్టుగా విద్యుత్తు సంస్కరణలకు ఒప్పుకోక పోవడం వలనే తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా ఐదు వేల కోట్లను నష్టపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. మీటర్లు పెట్టినవారికి, విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసిన వారికి కేంద్ర సహాయం చేస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యుత్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమైనా నిధులు తీసుకువచ్చారా అంటూ కిషన్ రెడ్డి పై విరుచుకుపడిన మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా లబ్ధి చేకూరలేదన్నారు.

బిజెపి నేతలు ఎలాంటి భాషను వాడుతున్నారో కిషన్ రెడ్డికి తెలియదా?
విద్యుత్ సంస్కరణలపై చట్టం తీసుకు రాకుండా పాలసీ విధానంలో అమలు చేస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ మాట్లాడే భాష గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి నేతలు ఎలాంటి భాషను వాడుతున్నారో కిషన్ రెడ్డికి తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డితో చర్చకు టిఆర్ఎస్ కార్యకర్త కూడా అవసరం లేదని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు చూసి జనం నవ్వుకుంటున్నారని, ఆయనను చూస్తే జాలేస్తుంది అని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు
బిజెపి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, మోడీ ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు చేసిన అవమానం గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications