విద్యుత్ బకాయిలపై కేంద్రనిర్ణయం అందుకే; రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టే కుట్రతోనే: మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఏపీకి తెలంగాణ చెల్లించాల్సి ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం కావాలని రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు

కేంద్రానిది ముమ్మాటికీ దేశద్రోహ పూరిత చర్యే: మంత్రి జగదీశ్ రెడ్డి
ఇది ముమ్మాటికీ దేశద్రోహ పూరిత చర్యేనని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.12,900 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయిని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై కేంద్రానికి తాము మొరపెట్టుకున్నా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.విద్యుత్ బకాయిలతో పాటు, పిపిఏల లోను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాకు నష్టమే చేసిందని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఒక్క రోజు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని విమర్శించారు.

విద్యుత్ రంగంలో కేసీఆర్ సాధించిన విజయాలు జీర్ణించుకోలేని బీజేపీ
2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదు అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి కేంద్రం తీరు వల్ల అంధకారం చోటు చేసుకునే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానులలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని పేర్కొన్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఎటువంటి విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో సీఎం కెసిఆర్ సాధించిన విజయాలను బిజెపి సర్కార్ జీర్ణించుకోలేకపోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణాలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లేకుండా చెయ్యాలనే కుట్ర
బీజేపీ సర్కార్ కు తెలంగాణలో విద్యుత్ సమస్య లేకపోవడం నచ్చటంలేదని, వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు అందిస్తామని తాము చెప్పిన నేపథ్యంలో ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ఎందుకు జోక్యం చేసుకోలేదో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే కృష్ణా, గోదావరి జలాల వివాదం లోనూ కేంద్రం అవలంబిస్తున్న ధోరణిపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణాపై కక్షతోనే ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కేంద్రం
తెలంగాణ పై కక్షతో కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుని నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పడం దుర్మార్గమని, మోటార్లకు మీటర్లు పెట్టనని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతోనే కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడింది అని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి ఏపీ రాసిన లేఖలు కనిపిస్తున్నాయి కానీ తెలంగాణ రాసిన లేఖలు ఎందుకు కనిపించలేదని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications