బీజేపీ మార్క్ అబద్దాలు.. మోడీజీ దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు? కేటీఆర్ సూటిప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో జూలై 2,3 తేదీలలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. దీనికోసం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉండనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు భాగ్యనగరానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతుంది.

తెలంగాణాలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
ఇప్పటికే అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి పార్టీల మధ్య ఫ్లెక్సీ ల వార్ కొనసాగుతుంది. సాలు దొర సెలవు దొర అంటూ బిజెపి డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసి కెసిఆర్ ను టార్గెట్ చేస్తే, సాలు దొర సంపకు దొరా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ రిజైన్ మోడీ, బై బై మోడీ, స్టెప్ డౌన్ మోడీ అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు,
అబద్దాలలో బీజేపీ నేతలను మించిన వారు లేరన్న కేటీఆర్
అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మోడీని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ అబద్ధాల్లో బిజెపి పార్టీ నేతలను మించినవారు ఎవరూ లేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్ దేశాన్ని ఎన్ని సార్లు మోసం చేస్తారు మోడీజీ ఏంటి సూటి ప్రశ్న వేశారు. అబద్ధాలు.. పచ్చి అబద్దాలు.. బిజెపి మార్క్ అబద్ధాలు అంటూ విరుచుకు పడ్డారు మంత్రి కేటీఆర్.

దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుద్దీకరణ జరిగిందని 2018లోనే చెప్పిన మోడీ .. కానీ జరుగుతుందిదే
ఏప్రిల్, 2018లో భారతదేశంలోని అన్ని గ్రామాలకు విద్యుద్దీకరణ జరిగిందని మోడీ జీ చెప్పారని పేర్కొన్నారు. జూన్ 25, 2022న బిజెపి బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జీ గ్రామానికి ఎట్టకేలకు విద్యుత్ వచ్చింది అంటూ పేర్కొన్నారు. 2018లో మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను, ప్రస్తుతం ద్రౌపదీ ముర్ము గ్రామానికి సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇటీవల కరెంట్ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్న వార్తను పోస్ట్ చేసి.. దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తావు మోడీ జీ? అంటూ గట్టిగా ప్రశ్నించారు.

పీఎం మోడీని కేటీఆర్ గట్టిగానే టార్గెట్ చేసే అవకాశం
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆయనను టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధులు ఇవ్వకుండా, ఎలాంటి అభివృద్ధి జరగకుండా కేంద్రం పెట్టిన ఇబ్బందులపై ఏకరువు పెట్టే అవకాశం లేకపోలేదు. ప్రధాని మోడీని మరింత తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందని సమాచారం. ఇంతకు ముందు బీజేపీ అగ్రనేతలు ఎవరు రాష్ట్రానికి వచ్చినా కేటీఆర్ తనదైన శైలిలో వారిపై ప్రశ్నాస్త్రాలను ఎక్కు పెట్టారు. ఇక మోడీ విషయంలో కూడా వెనక్కు తగ్గకుండా కేటీఆర్ తన ప్రశ్నాస్త్రాలు సంధిస్తారని ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications