నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఏమన్నారంటే..?
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. గత రెండు రోజులుగా కామారెడ్డి జిల్లాలో పర్యటించిన నిర్మలాసీతారామన్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో నిన్న నిర్మల సీతారామన్ బీర్కూరు లో రేషన్ షాప్ ను సందర్శించి, రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీ లేకపోవడంపై కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ షాపులో మోడీ ఫోటోలు లేకపోవటంపై మండిపడిన నిర్మలా సీతారామన్
రేషన్ బియ్యానికి కిలోకు 35 రూపాయలు ఖర్చవుతుందని, అందులో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్న నిర్మలాసీతారామన్, నిరుపేద ప్రజలందరికీ బియ్యం అందిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రేషన్ షాప్ లో ప్రధాని ఫోటోలు ఉండాలని ఆమె పేర్కొన్నారు.
కామారెడ్డి కలెక్టర్ కు క్లాస్ పీకిన నిర్మలా సీతారామన్ ..
ఇక రేషన్ షాప్ సందర్శనలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను రేషన్ లో కేంద్రం వాటా రాష్ట్ర వాటా ఎంత అని ప్రశ్నించారు. దానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ తనకు తెలియదని సమాధానం చెప్పడంతో, ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి ఈ విషయం తెలియక పోతే ఎలా అంటూ ప్రశ్నించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.
అంతేకాదు అరగంట సమయం ఇస్తున్నా తెలుసుకొని చెప్పండి అంటూ ఆదేశించారు . ఇక ప్రధాని మోడీ ఫోటోలు రేషన్ షాప్ లో లేకపోవడం పైన కూడా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల సీతారామన్.
నిర్మలా సీతారామన్ ప్రవర్తనపై మండిపడుతున్న మంత్రులు
ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ స్పందించారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలు లేవంటూ ప్రధాని స్థాయిని నిర్మలా సీతారామన్ దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టింది అని పేర్కొన్నారు. నిర్మల సీతారామన్ వింతైన ప్రవర్తన చూపించారని మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు.
కలెక్టర్ కు బాసటగా నిర్మలా సీతారామన్ ప్రవర్తనను టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్
రోడ్లమీద తిరిగే ఈ రాజకీయ నాయకులు కష్టపడి పనిచేసే ఆలిండియా సర్వీసెస్ అధికారులను కూడా నిరుత్సాహపరుస్తారు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాదు కలెక్టర్ జితేష్ వి పాటిల్ గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై రేషన్ షాప్ ముందు కేంద్ర ప్రభుత్వం నిధులు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనే అంశంపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ జిల్లా కలెక్టర్ కు ఉపన్యాసాలు ఇవ్వడం భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనిది అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరో ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు.