రూ. 135 కోట్లతో గ్లోబల్ డెలివరి సెంటర్: ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: 20 మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సిఫి టెక్నాలజీస్ అతిపెద్ద గ్లోబల్ డెలివరీ సెంటర్ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనుకూలమన్నారు.
సిఫీ కంపెనీ భాగస్వామ్యంతో ఫుజిస్టు యాజమాన్యం ప్రపంచంలో అత్యంత పెద్దదైన గ్లోబల్ డెలివరి సెంటర్ను నగరంలో నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఈ గ్లోబల్ డెలివరి సెంటర్ కోసం 135 కోట్ల వ్యయాన్ని వెచ్చించనున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగ కల్పన జరగతుందన్నారు. డాటా కేంద్రాలకు హైదరాబాదే అత్యుత్తమ ప్రాంతమని, దీంతో పాటు నగరంలో డాటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా 'ఈ-వాహన్ బీమా' అనే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
ఐఆర్డీఏ సూచనల ప్రకారం రవాణాశాఖ, పోలీసు, ఐటీ శాఖలు సంయుక్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాయని మంత్రి తెలిపారు.

డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: గంటా చక్రపాణి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2015 టీఎస్పీఎస్సీ నివేదికను గవర్నర్ నరసింహాన్కు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం నుంచి సూచనలు అందాయని, డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఖాళీలను అందిస్తే వెంటనే భర్తీ చేస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతీయ సదస్సుకు గవర్నర్ నరసింహన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు.
ఈ కాన్ఫరెన్స్కు 29 రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. సదస్సులో పరీక్షల విధానం, ఇతర సంస్కరణలపై చర్చ జరుగుతుందన్నారు. గత ఏడాది తొమ్మిది నోటిఫికేషన్లతో రెండు వేల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. టీఎస్పీఎస్సీ ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రెండు అవార్డులు వచ్చినందుకు గవర్నర్ నరసింహాన్ అభినందించారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications