ఇలావుంటే గ్లోబల్ సిటీ ఎలా అవుతుంది?: కెటిఆర్ క్లాస్
హైదరాబాద్: నగరంలోని రోడ్ల దుస్థితిపై పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు జీహెచ్ఎంసీ అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజల కనీస సౌకర్యాలు తీర్చలేకున్నామని అన్నారు. రోడ్లు వేసిన వెంటనే తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు.
కోట్లు ఖర్చు పెడుతున్నా.. చిన్న వర్షానికి పాడైపోతున్నాయని, చెరువులను తలపిస్తున్నాయని మంత్రి అన్నారు. అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధికారులు సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ఎందుకు ఉందని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.
తాను 9గంటలకు జీహెచ్ఎంసీ సమావేశానికి హాజరుకావాల్సి ఉందని.. కానీ, తీవ్ర ట్రాఫిక్ జాం కారణంగా 20నిమిషాలపాటు లేటుగా రావాల్సి వచ్చిందని అన్నారు. అంబులెన్స్కు దారివ్వని సిటీ గ్లోబల్ సిటీ కాదని అన్నారు. ఎయిర్పోర్టురోడ్డు, ఔటర్రింగ్రోడ్డు మాదిరిగా నగర రోడ్లు ఉండాలని ఆయన సూచించారు.
నగర సగటుగా పౌరుడిగా ఆలోచిస్తే చాలా సమస్యలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజల మౌలిక వసతులు తీర్చాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ప్రజలు గొప్పవారు కాబట్టే.. ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.
నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించారు. రోడ్డు సర్కిళ్ల మెంటేనెన్స్ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు చర్యలు చేపడ్తామని అన్నారు. కాగా, రోడ్ల తొలగింపు మరమ్మతులు ఒకే ఏజెన్సీకి ఇస్తే మంచిదని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.