బీఆర్ఎస్ భవన్ ప్రారంభం: దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడి అన్న మంత్రి కేటీఆర్
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు , పలువురు అతిధుల సమక్షంలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ హాజరు కాలేదు. కానీ ఢిల్లీలో టిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆ నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంధాను ఎంచుకున్నారని, ఈరోజు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని సృష్టించబోతున్నారు అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇక తాను ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయాను అంటూ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో సమావేశం ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. సిరిసిల్లలో సెస్ ఎన్నికల నామినేషన్ లు కూడా ఈ రోజే ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మొదట అక్కడ రాజ శ్యామల, నవ చండీ యాగాన్ని నిర్వహించి యాగాల నిర్వహణ అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జెడిఎస్ నేత కుమారస్వామి హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇప్పటికే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతుందని కవితతో పాటు పలువురు బీఆర్ఎస్ మంత్రులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం మంత్రి కేటీఆర్ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్.. బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత!!