గుజరాతీ దొంగల డబ్బులు, తులం బంగారం తీసుకోండి.. ఓటు మాత్రం టీఆర్ఎస్కే: మంత్రి కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. మునుగోడు ఉప ఎన్నికలలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీల నేతలపై, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో కేటీఆర్ తనదైన శైలిలో రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేశారు.
ఓటుకు తులం బంగారం ఇస్తారు తీసుకోండి : మంత్రి కేటీఆర్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడు సంవత్సరాలుగా కోవర్టుగా పనిచేసి బేరసారాలు చేసుకొని 18 వేల కోట్ల కాంట్రాక్టులు దక్కిన తర్వాత ఆత్మాభిమానాన్ని గుజరాత్ సేట్ ల వద్ద తాకట్టు పెట్టారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని, అవి గుజరాత్ దొంగల పైసలు దబాయించి తీసుకోండి అంటూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చింది తీసుకొని, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్న ఉప ఎన్నిక కాదు
గత ఎన్నికలలో మునుగోడు ప్రజలు పొరపాటున కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలిపించారని, రాజగోపాల్ రెడ్డి గెలిచిన నాటి నుంచి ప్రజా సమస్యలను పక్కనపెట్టి బిజెపి జపం చేశారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను, ఏ నాడు ప్రభుత్వం దృష్టికి తీసుకు రాలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అనవసరంగా మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తీసుకువచ్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్న ఉపఎన్నిక కాదన్నారు.

రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చిన పెద్దలు ఎవరు? గుజరాత్ గద్దలు ఎవరు?
శివలింగం వస్తే మాది శవం వస్తే మీది అంటూ మాటలు మాట్లాడే చిల్లర నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనది చిన్న కంపెనీ అని చెప్పుకొని 18 వేల కోట్లు కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారు. ఇచ్చిన పెద్దలు ఎవరు? గుజరాత్ గద్దలు ఎవరు? అంటూ మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు.

మోడీవి పకోడీ మాటలు ..
2016లో కేంద్ర ఆరోగ్య మంత్రి గా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడ కి వచ్చి 300 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తానని చెప్పారని, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారని, కనీసం ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడా కూడా తట్టెడు మట్టి కూడా తీయలేదని కేటీఆర్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇడ్లీ బండి, పకోడీ బండి పెట్టుకోవాలంటూ యువతకు సూచిస్తున్నారు అని పేర్కొన్నారు. మోడీవి అన్ని పకోడీ మాటలు అంటూ మండిపడ్డారు.
ఓటు వేసే సమయంలో ఇవన్నీ గుర్తు పెట్టుకోండి
రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేశారని, ఒకప్పుడు 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలు ప్రస్తుతం పన్నెండు వందల కు పెంచారని, చేనేత పరిశ్రమ పై జిఎస్టి వేశారని, నల్లధనం తెస్తానని చెప్పి తెల్లమొహం వేశారని, ఇక ఓటు వేసే సమయంలో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్ ది అని పేర్కొని, రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications