మా మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిది... వాడితే చీల్చి చెండాడటమే.. విపక్షాలకు కేటీఆర్ వార్నింగ్..
టీఆర్ఎస్ మౌనాన్ని బలహీనతగా భావించొద్దని... తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని విపక్షాలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై కొంతమంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్ల కన్నా తాము ఎక్కువే మాట్లాడగలమని... కానీ తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సమయంలో మీడియా,మనీ,మజిల్ పవర్... ఇవేవీ ఆయనకు లేవని గుర్తుచేశారు. ఎంత నిరాశ కమ్ముకున్నా కుంగిపోకుండా తెలంగాణ సాధించారని కొనియాడారు. తెలంగాణ భవన్లో శనివారం(మార్చి 6) టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఉద్యమంలో అడ్రస్ లేనోళ్లు కూడా ఇప్పుడు నోటికొచ్చినట్లు... : కేటీఆర్
వచ్చే ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పదవులను గడ్డిపోచలా విసిరికొట్టిన చరిత్ర కేసీఆర్కు,టీఆర్ఎస్ పార్టీకి ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మధ్యలోనే వదిలిపెడితే... రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.ఇవాళ దేశంలో తెలంగాణ సగర్వంగా నిలబడిందంటే అందులో కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉందన్నారు అలాంటి నేతపై తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ కూడా లేని కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మా గోడకు వేలాడే తుపాకీ లాంటిది...
బీజేపీ నేతలకు ఏమీ తెలియదని.. వాళ్లంతా వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎంలనే ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందని.. బీజేపీ వాళ్లను ఉరికించుడు పెద్ద పనేమీ కాదని హెచ్చరించారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని.. మితిమీరితే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ ఆరేళ్ల పాలనలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందన్నారు.బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పే శక్తి విద్యార్థి లోకానికి ఉందన్నారు.

తెలంగాణకు బీజేపీ చేసిందేంటి... : కేటీఆర్
దుబ్బాకలో చావు తప్పు కన్ను లొట్టపోయినట్లు కేవలం 500 ఓట్లతో బీజేపీ గెలిచిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. అయినప్పటికీ బీజేపీ నేతలు ఎక్కడా ఆగట్లేదని విమర్శించారు. ఏమన్నా అంటే దేశం కోసం ధర్మం కోసం,పాకిస్తాన్ వంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారని విమర్శించారు. ఉత్త ముచ్చట్లు,ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్కు కేంద్రం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది నిజమా కాదా అని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని నిలదీశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి 160 ఎకరాలు ఇచ్చినా ఇక్కడ దాన్ని పెట్టమని చెప్పింది నిజమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఐఐటీ,ఐఐఎం,ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నది నిజం కాదా అని మండిపడ్డారు. ఏం ముఖం పెట్టుకుని ఇవాళ బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారని ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications