ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు; బండి సంజయ్, అమిత్షాలను ఏకిపారేసిన మంత్రి కేటీఆర్
ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్రం నుండి బీజేపీపై విరుచుకు పడే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, ఆదివారం జరిగిన అమిత్ షా సభ బీజేపీని, బండి సంజయ్ ను టార్గెట్ చేయడానికి వీలు కల్పించింది. అమిత్ షా కు చెప్పులు మోసిన బండి సంజయ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని టార్గెట్ చేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.
చెప్పులు మోసిన బండి సంజయ్ వీడియో ను టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్ననాయకుడిని -తెలంగాణరాష్ట్రం గమనిస్తున్నది అంటూ పేర్కొన్నారు. ఢిల్లీ పాలకులకు, గుజరాతి నాయకులకు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నాడని, తెలంగాణలో అటువంటి నాయకత్వం ఉందని బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు కెసిఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణా ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొడతాం
అంతేకాదు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది అంటూ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న బిజెపిని తరిమికొడతారు అంటూ బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన లో సీఎం కేసీఆర్ చేరలేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.
ఫసల్ భీమా యోజన గుజరాత్ కు మంచిది కాకుంటే తెలంగాణాకు మంచిది అవుతుందా?
అంతకు ముందు గుజరాతీ బిజెపి ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని తిరస్కరించిందని, ఆ రాష్ట్రంలో దీనిని నిలిపివేసింది అని పేర్కొన్న మంత్రి కేటీఆర్, మీ సొంత రాష్ట్రం గుజరాత్ కు మంచిది కాకపోతే, ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణ రాష్ట్రానికి మంచిది ఎలా అవుతుందంటూ అమిత్ షా ను ప్రశ్నించారు. ఇటువంటి అసంబద్ధమైన కపటత్వాన్ని ప్రదర్శించటం మీకే చెల్లుబాటు అవుతుంది అంటూ అమిత్ షా ను టార్గెట్ చేశారు. మునుగోడు సభలో అమిత్ షా మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ రైతు వ్యతిరేకి.. ఇది ఈ శతాబ్దపు జోక్
అంతేకాదు సీఎం కేసీఆర్ ను రైతు వ్యతిరేకి అని సంబోధించడం ఈ శతాబ్దపు జోక్ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. కెసిఆర్ ఆలోచనలో ఉన్న రైతు బంధుని కాపీ చేసి పిఎం కిసాన్ గా పేరు మార్చింది ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం ఎదుర్కొన్న తర్వాత దేశంలోని రైతులకు ఎవరు క్షమాపణలు చెప్పారో చెప్పాలని, 700 మంది రైతుల విలువైన ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత రైతులను మన్నించమని అడిగింది ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.