మీరు రైతులా.. దున్నపోతులా? అన్నదాతలపై మంత్రి మల్లారెడ్డి వీరంగం.. ఆపై రచ్చ!!
సంచలనాలకు కేరాఫ్ అయిన మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రైతుల పైన దుర్భాషలాడుతూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మీరు రైతులా? దున్నపోతులా? అంటూ రెచ్చిపోయారు. మంత్రి మల్లారెడ్డి తీరు నిరసనగా రైతులు సమావేశంలోనే ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం రచ్చగా మారింది.
ఇంతకు ఏం జరిగింది అంటే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణంలోని నారాయణ గార్డెన్లో రైతు సేవ సహకార సంఘం అధ్యక్షుడు రామ్ రెడ్డి అధ్యక్షతన రైతు సహకార సంఘం సమావేశం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన మంత్రి మల్లారెడ్డి రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మేలును, రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును సమావేశం వేదికగా ఎండగట్టారు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు.

రైతులకు ఇస్తున్న రుణమాఫీ గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్న క్రమంలో, సమావేశంలో పాల్గొన్న రైతులు రుణమాఫీ ఎక్కడ చేశారో చెప్పాలంటూ నిలదీశారు. హరినాథ్ రెడ్డి అనే రైతు 80,000 రూపాయలు వ్యవసాయం కోసం బ్యాంకు నుండి రుణం తీసుకుంటే, దాని వడ్డీ మళ్లీ 80 వేల రూపాయలు అయిందని, ఇప్పటివరకు రుణమాఫీ చెయ్యలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక రైతులు వరుసగా రుణమాఫీ విషయంలో మంత్రి మల్లారెడ్డిని నిలదీయడంతో ఊగిపోయిన మంత్రి దున్నపోతుల్లా ఉన్నారు.. మీరు రైతులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బయటకు గుంజుకు పొండి అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు.
దీంతో రైతులు ఒక్కసారిగా మంత్రి మల్లారెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలోనే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంత్రి మల్లారెడ్డి రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చెయ్యటాన్ని రైతులు తీవ్రంగా ఖండించారు. దీంతో పరిస్థితిని కంట్రోల్ చెయ్యటం కోసం పోలీసులు కొంతమంది రైతులని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇక రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications