మరో వివాదంలో ఇరుక్కున్న మంత్రి మల్లారెడ్డి... ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడ ప్రాంత ప్రజలు మల్లారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం(ఆగస్టు 29) జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'మీకు అన్ని వసతులు కల్పిస్తా.. ఇంకోటి అదృష్టం చూసినవా.. మనకే వాసన జవహర్ నగర్కు దిక్కులేదు ఇప్పుడు.. అక్కడ దమ్మాయిగూడ దిక్కు పోయింది.' అంటూ మల్లారెడ్డి నవ్వుతూ కామెంట్ చేశారు. ఆయన మాటలకు అక్కడున్న జనమంతా నవ్వారు. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలపై దమ్మాయిగూడ జనం మండిపడుతున్నారు.డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి ఆయన వ్యాఖ్యలను తప్పు పట్టింది.మల్లారెడ్డి మాటలు దమ్మాయిగూడ ప్రజలను అవమానించేలా ఉన్నాయని సమితి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
'మంత్రి గారూ.. దమ్మాయిగూడకు వాసన వస్తే మీకు అదృష్టమా..? వాసన జవహర్నగర్ నుంచి దమ్మాయి గూడకు రాదు, దమ్మాయి గూడ నుంచి జవహర్ నగర్కు పోదు.. అది గాలి ఎటువుంటే అటే పోతుంది.' అని వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డి దమ్మాయిగూడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు,డంపింగ్ యార్డు మూసివేతకు చర్యలు తీసుకోవాలన్నారు.
మల్లారెడ్డి వ్యాఖ్యలపై స్థానిక కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. డంపింగ్ యార్డు వాసన దమ్మాయిగూడ వైపు వెళ్తుందని మల్లారెడ్డి గర్వంగా చెబుతున్నారని... స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆయన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 16 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు మల్లారెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలి కాలంలో మంత్రి మల్లారెడ్డి తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. రెండు మూడు రోజుల క్రితం ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన దూషణలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని జోకర్,బ్రోకర్ అంటూ విమర్శలు చేయగా... మల్లారెడ్డి అంతకు రెట్టింపు పదజాలంతో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తొడగొట్టి మరీ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డి... వారికి క్షమాపణలు చెప్పారు.
రేవంత్పై మల్లారెడ్డి విమర్శలను మంత్రి కేటీఆర్ వెనకేసుకొచ్చారు. వాళ్లు మాట్లాడారు కాబట్టే తమవాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు.మా మల్లా రెడ్డికి జోష్ ఎక్కువని.. అందుకే ఆవేశంలో అలా మాట్లాడారని అన్నారు.తెలంగాణ కాంగ్రెస్ను చంద్రబాబు.. ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడని.. చిలక మనదే అయినా.. మాట్లాడిస్తున్నది మాత్రం చంద్రబాబే అని విమర్శించారు.