TSRTC: తెలంగాణలో నడిచేదెప్పుడు.. మంత్రి పువ్వాడ ఏమంటున్నారు..
కరోనా లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అయితే మూడో విడత లాక్ డౌన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కేంద్రం పలు సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రైళ్లకు అనుమతినిచ్చింది. అలాగే విమాన సర్వీసులను కూడా ప్రారంభించే యోచనలో ఉంది. గ్రీన్ జోన్ల పరిధిలో 50శాతం ఆక్యుపెన్సీతో బస్సుల నిర్వహణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంకా ఎటూ తేల్చలేదు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆర్టీసీ బస్సులను నడపాలా వద్దా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
Recommended Video

ఇకపై అలా కుదరదు..
ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ దీనిపై స్పందించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఈ నెల 15 తర్వాత ఆర్టీసీ నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఆర్టీసీ ప్రయాణం గతంలో ఉన్నట్టు ఉండదన్నారు. ఒకే సీట్లో ముగ్గురు లేదా నలుగురు కూర్చోవడం, నిలబడి ప్రయాణించడం ఇకపై కుదరదని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం దృష్టికి ఆర్టీసీ సమస్య..
ఏయే రూట్లలో బస్సులు నడపాలి.. సీట్ల కేటాయింపు.. టికెట్ల ధరలు.. తదితర అంశాలపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తామని అజయ్ తెలిపారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్టీసీపై లాక్ డౌన్ మరింత ప్రభావం చూపిందన్నారు. అయినప్పటికీ లాక్ డౌన్ సమయంలోనూ సిబ్బందికి 50శాతం వేతనాలు ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ పరిస్థితి కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్ళామని.. ఎలాంటి సాయం చేస్తారో వేచి చూడాలని అన్నారు. ఇప్పటివరకూ అధికారులు,ముఖ్యమంత్రితో జరిపిన సంప్రదింపుల మేరకు ఆరెంజ్,గ్రీన్ జోన్లలో మాత్రమే బస్సులు నడిపే యోచనలో ఉన్నట్టు తెలిపారు.

కండిషన్ను చెక్ చేస్తున్న సిబ్బంది..
లాక్ డౌన్ ఎఫెక్ట్తో ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రతీ డిపోకి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. అయినప్పటికీ లాక్ డౌన్ పీరియడ్లో బస్సుల కండిషన్పై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ప్రతీ డిపోకి కొంతమంది సిబ్బందిని నియమించి బస్సుల కండిషన్ను చెక్ చేయిస్తోంది. సాధారణంగా 4 రోజులకు ఒకసారి బస్సు కండిషన్ను పరిశీలించాల్సి ఉంటుంది. రోజుకు గంట సేపైనా ఇంజన్ ఆన్ చేయకపోతే బ్యాటరీ దెబ్బతినడం,ఇతరత్రా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏసీ బస్సుల్లోనూ ప్రతీరోజూ గంట పాటు ఇంజన్ ఆన్ చేయాలి. ఎండ వేడికి కూడా ఇంజన్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఆర్టీసీ సిబ్బంది అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతీరోజూ డిపోకి వెళ్లి బస్సుల కండిషన్ను పరిశీలిస్తున్నారు. బస్సులు డిపోల నుంచి బయటకు తీసేనాటికి కచ్చితమైన కండిషన్తోనే రోడ్డెక్కిస్తామని వారు చెబుతున్నారు.

టికెట్ల ధరల పెంపు..?
మునుపటిలా కాకుండా ఇకనుంచి ఆర్టీసీ బస్సుల్లో నంబర్ల వారీగా సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అంటే,కేటాయించిన నంబర్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఫేస్ మాస్కులు ఉన్నవారినే బస్సు లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. బస్పు బయలుదేరే ముందు,గమ్య స్థానం చేరాక తప్పనిసరిగా శానిటైజ్ చేస్తారు. ఇక 50శాతం ఆక్యుపెన్సీతోనే బస్సులను నడపాల్సి ఉంటుంది కాబట్టి.. టికెట్ల ధరల పెంపుకు అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వం దీనిపై తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలతో 50శాతం ఆక్యుపెన్సీతో బస్సులను నడిపితే నష్టం తప్పదు. కాబట్టి టికెట్ ధరల పెంపుపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications