కిషన్ రెడ్డి తెలంగాణాలోనే పుట్టారా? బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వకుంటే జరిగేదదే: మంత్రి సత్యవతి వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్రానికి ఏపీ, తెలంగాణ విభజన హామీలలో భాగంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నటికీ సాధ్యం కాదని, ఎవరు ప్రయత్నించినా అందుకు తగిన అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతూ తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డిపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం
తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అంటూ ఆమె పేర్కొన్నారు. బయ్యారం ప్రాంతంలో ఉక్కును ఇతర ప్రాంతాలకు తరలించవద్దని స్థానిక ప్రజలు అనేక మార్లు ఉద్యమించారని, దీంతో గత ప్రభుత్వం బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పడం సిగ్గుచేటని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.

కిషన్ రెడ్డి తెలంగాణాలోనే పుట్టారా? మంత్రి మండిపాటు
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా .. తెలంగాణ లోనే పుట్టారా అనేది అనుమానం వస్తుందని సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం గిరిజనులకు అన్యాయం చేసేలా ఉందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే బిజెపి ప్రభుత్వం తమ నిర్ణయాలను సమీక్షించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మీకు ఎలా గోరీ కట్టాలో మాకు తెలుసు అని పేర్కొన్న సత్యవతి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధించేదాకా పోరాటం చేస్తామన్నారు.

కిషన్ రెడ్డి ప్రకటన సిగ్గు చేటు: ఎంపీ మాలోతు కవిత ఫైర్
ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన సిగ్గుచేటని ఎంపీ మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై చేసిన ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర మీద కిషన్ రెడ్డికి ప్రేమ లేదని తేలిపోయిందని ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. గిరిజనులు అంటే బీజేపీకి గిట్టదా అని ప్రశ్నించిన మాలోతు కవిత గిరిజనుల నుంచి తిరుగుబాటు రాకముందే బిజెపి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలన్నారు. గిరిజనుల ఆశలకు ఉరి వేస్తే, గిరిజనులు బిజెపిని పాతర వేస్తారని ఎంపీ మాలోతు కవిత హెచ్చరించారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి: ఎంపీ కవిత డిమాండ్
కిషన్ రెడ్డి తన ప్రకటన ద్వారా దద్దమ్మగా నిరూపించుకున్నారని మాలోతు కవిత మండిపడ్డారు. సంక్రాంతి పండుగ ముందు వచ్చే బుడబుక్కల వాళ్ళలా బీజేపీ నేతలు వస్తున్నారు అంటూ ఎంపీ మాలోతు కవిత బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications