కోవిడ్ కట్టడికి పటిష్ట చర్యలు.!సీఎం పెట్టిన గడువు లోపు ధాన్యం కొనుగోలు చేయాలన్న మంత్ర సత్యవతి.!
హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో కొనసాగుతున్న లాక్డౌన్ వంటి చర్యల వల్ల కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని, ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కోవిడ్ పరీక్షలు పెంచి, కరోనాను పూర్తిగా కట్టడి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు. ధాన్యం కొనుగోలుకు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన గడువు ముగింపునకు వస్తున్న నేపథ్యంలో వేగంగా కొనుగోలు చేపట్టాలన్నారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ కమిషనర్ తో బుదవారం మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ టెలికాన్ఫరెన్సు నిర్వహించి కోవిడ్, ధాన్యం కొనుగోలు పరిస్థితులను సమీక్షించారు.
రెండో దశ ఫివర్ సర్వే ప్రారంభం..
కోవిడ్ లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి వారికి ఇంటివద్దే కోవిడ్ కిట్ లు ఇవ్వడానికి, కరోనాను గ్రామ స్థాయిలోనే కట్టడి చేసేందుకు ఫీవర్ రెండో దశ సర్వే పటిష్టంగా చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ఈ ఫీవర్ సర్వేలో కోవిడ్ బారిన పడ్డ వారి పరిస్థితి విషమిస్తే వెంటనే హాస్పిటల్ లో చేర్చేవిధంగా సమన్వయం చేయాలని, స్వల్ప లక్షణాలున్న వారిని ఇంటి వద్దే క్వారంటైన్ చేసి వారికి తగిన చికిత్స ఇస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
అందరికి వ్యాక్సినేషన్..
కోవిడ్ బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగోట్టుకోకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ మార్గదర్శనం చేస్తున్నారని, కాబట్టి కోవిడ్ వల్ల ప్రాణనష్టం జరగకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. వ్యాక్సినేషన్ మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో రెండో సారి వ్యాక్సిన్ తీసుకునే వారికి ఈ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నారు. వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాల వద్ద ప్రజలు గుమి కూడకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
రోహిణీ కార్తె మొదలైంది..
రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో ఈ వారాంతంలోనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సిఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాల్లో ధాన్యం కొనుగోలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గోనె సంచుల కొరత, రవాణా ఇబ్బందులను తొలగించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ తో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. గోనె సంచులు లేక, రవాణా సమస్యలుంటే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకోసం వెంటనే ఈ జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.
లాక్డౌన్ కు సహకరించాలి..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కరోనా కట్టడి కోసం ముందు చూపుతో లాక్డౌన్ విధించారని, దీంతో తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని, ప్రజల సహకారం ఇంకా కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మే నెల 10 నుండి తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోందని, మరో పొడిగింపు అవసరం లేకుండా ప్రజలు సహరిస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా కట్టడి అంశంలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని మంత్ర తెలిపారు.