నియమం పక్కన పెట్టి కొమురవెల్లి మల్లన్న గర్భగుడిలోకి తలసాని!
వరంగల్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు వరంగల్ జిల్లా కొమురవెల్లి మల్లన్న దేవాలయం గర్భగుడిలోకి వెళ్లారు. ఏ ఆలయంలో అయినా గర్భగుడిలోకి వెళ్తే లుంగీ కట్టుకొని, భుజాలపై తువ్వాలు ధరించి వెళ్లాలి. కానీ మంత్రి ఈ నియమాన్ని పాటించలేదు.
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చిన మంత్రి తలసాని ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్యాంటు, చొక్కా ధరించే గర్భ గుడిలోకి వెళ్లి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అంతేకాక ఫొటోల కోసం స్వామివారి మూలవిరాట్కు వీపు చూపారు. ఇది కూడా ఆధ్యాత్మిక, ధార్మిక నియమాలకు విరుద్ధం. కాగా, ఇది తొందరపాటులో జరిగిందని పశ్చాత్తాపం ప్రకటించారని తెలుస్తోంది.
మంచి పనులు చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు: తలసాని
తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆశీర్వదిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
కొమురవెల్లిలోని మల్లన్నను దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాణిజ్యశాఖలో ఎన్నడూ లేనివిధంగా 15 శాతం పన్నుల రాబడి పెరిగిందని, రానున్న రోజుల్లో వంద శాతం రాబడి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికలో 60 వేల మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పక ఆశీర్వదిస్తారన్నారు.