కెసిఆర్ది తప్పుకాదు, నేనూ వేరే పార్టీకే వేస్తానని చెప్తా: 'భువనేశ్వరి ఓటు'పై తలసాని
హైదరాబాద్: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తానని అన్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడంలో ఎలాంటి తప్పులేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు అన్నారు.
చిన్న విషయానికి రాజకీయం చేయడం సరికాదన్నారు. ఎవరైనా ఇంటికి వెళ్లి ఓటు వేయమని అడిగితే.. అలాగేనని చెబుతారని గుర్తు చేశారు. అలాంటి విషయాల పైన పెద్ద చర్చ అనవసరమన్నారు. అది ఏమాత్రం సరికాదని చెప్పారు. ప్రతి చిన్న దానిని చీఫ్ ట్రిక్గా అనడం తప్పన్నారు.
ఈ వ్యాఖ్యల పైన టిడిపి యువనేత నారా లోకేష్ అంతగా స్పందించవలసిన అవసరం లేదని చెప్పారు. తాను మోండా మార్కెట్లో ఉంటున్నానని, ఎవరైనా వేరే పార్టీ వారు వచ్చి ఓటు వేయమని తనని అడిగినా 'మంచిది' అంటానని, కానీ నా ఇంటికి వద్దని చెప్పను కదా అన్నారు.
అయితే, అలాంటి వ్యాఖ్యలు సహజంగా జరిగేవని తెలిసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. మా వదిన భువనేశ్వరి తమ పార్టీకి ఓటు వేస్తానని చెప్పారని కెసిఆర్ వ్యాఖ్యానించడం ఏమిటని తెలుగు దేశం తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అది ఓటర్లను తప్పుదారి పట్టించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
సాయంత్రం ఐదులోపు ప్రచారం ముగించాలి: జిహెచ్ఎంసి కమిషనర్
గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం అయిదు గంటల లోపు అభ్యర్థులు ప్రచారం ముగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అన్నారు. ఎస్సెమ్మెస్లు, బల్క్ ఎస్సెమ్మెస్లు, టీవీల్లో ప్రచారాలు నిలిపివేయాలన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు.