తెలంగాణా సహకార సంఘ ఎన్నికల్లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే : ఆధిపత్య పోరుపై ఆసక్తికర చర్చ
టిఆర్ఎస్ పార్టీలో మహబూబాబాద్ జిల్లాలో నడుస్తున్న ఆధిపత్య పోరు సహకార ఎన్నికల్లోనూ ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రిగా పని చేస్తున్న సత్యవతి రాథోడ్ కు, డోర్నకల్ స్థానిక ఎమ్మెల్యే రెడ్యా నాయక కు మధ్య టామ్ అండ్ జెర్రీ షో చాలా కాలంగా నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే సీనియర్ నాయకుడైన రెడ్యానాయక్ కు, మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ కు మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు సహకార ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది . మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గాల మధ్య కొనసాగుతున్న సహకార పోరు ఆసక్తికర చర్చగా మారింది.
సహకార సంఘాల ఎన్నికలలో మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్
తెలంగాణా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సహకార సంఘాల ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో జరుగుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది . డోర్నకల్ నియోజకవర్గంలో సహకార ఎన్నికల్లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించిన నేతలే పోటీలో ఉన్నారు . అయితే గుండ్రాతి మడుగు సొసైటీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీలో నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగుతుంది. మంత్రి సత్యవతి రాథోడ్కు గుండ్రాతిమడుగు సొంత ఊరు కావటం ప్రధాన కారణం .
గుండ్రాతి మడుగు బరిలో ఇరు వర్గాల నుండి అభ్యర్థులు
దీంతో ఆమె ముఖ్య అనుచరుడైన కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగి తమ వర్గం తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. అంతేకాదు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే రెడ్యానాయక్ సైతం తమ చైర్మన్ అభ్యర్థిగా గార్లపాటి వెంకట్ రెడ్డిని ప్రకటించి అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు. అంతే పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు . ఇక చాలా కాలంగా మంత్రి సత్యవతికి , ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా రెడ్యా నాయక్ తమ వర్గం గెలిచి మంత్రిపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఒకే పార్టీ నుంచి మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు నువ్వా నేనా అన్నట్టు సహకార ఎన్నికల్లో వేరువేరుగా అభ్యర్థులను బరిలో దించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది .
మొదట నుండీ రాజకీయ శత్రువులుగా ఉన్న సత్యవతి, రెడ్యాలు
ఇక మహబూబాబాద్ జిల్లా విషయానికి వస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ , రెడ్యా నాయక్ లు రాజకీయంగా చాలా కాలంగా ప్రత్యర్ధులు . రెడ్యా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా మంత్రిగా పని చేశారు. ఇక సత్యవతి రాథోడ్ టీడీపీలో కీలకంగా పని చేశారు . టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు ఒకే పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలలో సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఇచ్చారు సీఎం కేసీఆర్ . ఇక రెడ్యా ఎమ్మెల్యే కాగా , ఆయన కుమార్తె మాలోతు కవితకు ఎంపీగా అవకాశం ఇవ్వటంతో మంత్రిగా రెడ్యాకు చాన్స్ పోయింది.
సహకార ఎన్నికల్లో ఏ వర్గం విజయం సాధిస్తుందో అన్న ఆసక్తి
జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఆయన మంత్రి సత్యవతి రాథోడ్ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు . దీంతో రెడ్యానాయక్, సత్యవతిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది . ఈ విషయం ఇన్ని రోజులు స్థానికంగానే చర్చనీయాంశం కాగా తాజాగా సహకార ఎన్నికల్లో ఒక్క సారిగా రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తుంది . స్థానికంగానూ ప్రతి ఒక్కరు ఇదే విషయంపై చర్చించు కుంటున్నారు. సహకార ఎన్నికలో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే నువ్వా నేనా అని తలపడుతున్న తీరు విజయం ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠకు కారణం అవుతుంది .