వయస్సు 14 ఏళ్లే: చోరీల్లో ఆరితేరాడు, వేశ్యలకు వేలు వెచ్చించాడు
నల్లగొండ: జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఓ 14 బాలుడిని పోలీసులు పట్టుకున్నారు. గతంలో తప్పులు చేసి పట్టుబడినా అతను తన అలవాటును మార్చుకోలేదు. శిక్ష అనుభవించి మళ్లీ అదే తరహాలో చోరీలు చేయడం ప్రారంభించాడు. అతను వెల్లడించిన విషయాలు విని పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడు కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను చదువుకుంది ఏడో తరగతి. కానీ విలువైన ఫోన్ కనిపిస్తే చాలు మాయం చేయడానికి ఏ మాత్రం వెనకంజ వేయడు.

తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే ఏమైనా చేసి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను మాయం చేస్తాడు. చువ్వలు వంచడం, కిటికీల నుంచి లోనికి చొరబడడం వంటి వాటి కోసం కసరత్తు చేస్తాడు. నల్లగొండలోని ఎన్జీ కాలనీకి చెందిన తట్ల సుభాష్ చంద్రబోస్ (14) చిన్నప్పటి నుంచి జల్సాలకు మరిగాడు. అందుకు అక్రమంగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు.
తాను దొంగిలించిన సొత్తును వేశ్యల కోసం ఖర్చు చేసేవాడినని, ఒక్క రోజుకు ఓ మహిళకు రూ. 10 వేలు ఇచ్చేవాడినని అతను పోలీసుల విచారణలో చెప్పాడు. డబ్బు ఇంటికి తీసుకుని వెళ్తే అదెక్కడిదని తండ్రి అడుగుతాడని, అందుకని ఇంటికి వెళ్లకుండా వేశ్యల వద్దకు వెళ్లేవాడినని చెప్పాడు.
ఆ బాలుడి నుంచి పోలీసులు 6 తులాల బంగారం, 60 వేల రూపాయల నగదు, 300 గ్రాముల వెండ గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అతన్ని పోలీసులు వరంగల్లోని జువైనల్ హోంకు తరలిస్తామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications